టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నారు. గత ఎన్నికల్లో పరాజయం తర్వాత పార్టీ పటిష్టతపై నేతలకు దిశా నిర్దేశం చేస్తూ చంద్రబాబు వరుసగా జిల్లాల్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా డిసెంబర్ 18, బుధవారం నుంచి డిసెంబర్ 20, శుక్రవారం వరకు మూడురోజుల పాటు అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లా పార్టీ నేతలతో పాటు, పార్టమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా వేర్వేరుగా సమీక్షలు నిర్వహిస్తారు. ఈ రోజు జిల్లాలోని టీడీపీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్న చంద్రబాబుకు నేతలు, పార్టీ కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో నేతలు, కార్యకర్తలతో సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి జేసీ దివాకర్ రెడ్డి, పయ్యావుల కేశవ్, పవన్ రెడ్డి, పల్లె రఘునాథరెడ్డి, కళా వెంకట్రావు, ఇతర టీడీపీ నాయకులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలపై కేసులు పెట్టి వేధిస్తున్నారని చెప్పారు. ఎన్నికల ముందు వైసీపీ నాయకులు గాలి కబుర్లు చెప్పి ఓట్లు దండుకున్నారని విమర్శించారు. అసెంబ్లీ వద్ద ప్రతిపక్షనేత అని కూడా చూడకుండా గేటువద్దే అడ్డుకున్నారని అన్నారు. ఈ విధంగా సమస్యలు, ఇబ్బందులు సృష్టిస్తే వడ్డీతో సహా చెల్లించే రోజు త్వరలోనే వస్తుందన్నారు. సీఎం వైఎస్ జగన్ వయసులో చిన్నవాడని, కనీసం గౌరవం ఇవ్వడం తెలియదని ఆరోపించారు. అసెంబ్లీ మాయసభను తలపిస్తుందని, కౌరవులు ఆ పక్కన ఉన్నారని, ఎప్పటికైనా పాండవులే గెలుస్తారని అన్నారు. 6 నెలల్లో 33 శాతం ఆదాయమే వచ్చిందని, అలాగే రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా రాలేదని చెప్పారు. రాష్ట్రం కోసం ప్రపంచమంతా తిరిగి, ఐదేళ్ల పాటు రాత్రింబవళ్లు కష్టపడ్డానన్నారు. అయితే ఇవాళ తెలుగుజాతిని చూస్తే బాధ కలుగుతోందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
[subscribe]