ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైన్స్ అండ్ జియాలజీ శాఖ అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందించారు. ఇటీవల ఏపీ మైన్స్ అండ్ జియాలజీ శాఖకు జాతీయ అవార్డు లభించిన నేపథ్యంలో ఏపీ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది మరియు డైరెక్టర్ వీజీ వెంకటరెడ్డిలు శుక్రవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిశారు. ఈ సందర్భంగా కేంద్ర గనుల శాఖ ‘ఖనిజ వికాస్ అవార్డు’ క్రింద ఏపీ గనుల శాఖకు అందజేసిన రూ. 2.40 కోట్ల ప్రోత్సాహక చెక్ను వారు సీఎంకు చూపించారు. ఈ క్రమంలో సీఎం జగన్ గనుల శాఖ అధికారులను అభినందిస్తూ.. ఈ అవార్డుతో గనుల శాఖ బాధ్యత మరింత పెరిగిందని, దీనిని స్ఫూర్తిగా తీసుకుని గనుల శాఖను అభివృద్ధి పథంలో నడిచేలా పనిచేయాలని ఆకాంక్షించారు.
కాగా గనుల శాఖ అనుసరిస్తున్న పారదర్శక విధానాలకు జాతీయ స్ధాయిలో గుర్తింపు దక్కింది. ఉత్తమ విధానాలను అమలు చేసినందుకు గాను రాష్ట్ర గనులు మరియు భూగర్భ శాస్త్ర శాఖకు కేంద్ర బొగ్గు, గనుల శాఖ నుంచి ‘ఖనిజ వికాస్’ అవార్డు దక్కింది. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా మంగళవారం న్యూఢిల్లీలోని అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో జరిగిన ‘మైన్స్ అండ్ మినరల్స్’ జాతీయ సమ్మేళనంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేతుల మీదుగా గోపాలకృష్ణ ద్వివేది, వీజీ.వెంకటరెడ్డిలు ఈ ప్రతిష్టాత్మక అవార్డు అందుకున్నారు. గనుల అన్వేషణ, వేలం మరియు నిర్వహణలో ఉత్తమ పనితీరు కనబరిచినందుకు గాను కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ ‘రాష్ట్రీయ ఖనిజ్ వికాస్ పురస్కార్’ క్రింద గనుల శాఖకు రూ.2.4 కోట్ల ప్రోత్సాహకాన్ని అందించింది. దీంతో పాటు 2022-23కి గాను ఆంధ్రప్రదేశ్కు G4 స్థాయికి చెందిన 5 తాజా బ్లాకులను అప్పగించడానికి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నివేదికలను కూడా కేంద్రం సమర్పించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ