ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగుల ఎదురుచూపులకు ముగింపు పడింది. పీఆర్సీపై ప్రకటన ఎప్పుడా అని ఎదురుచూస్తున్న వారికి ఏపీ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. ఈ విషయంలో ఉద్యోగులకు జగన్ సర్కార్ ఫిట్మెంట్పై స్పష్టత ఇచ్చింది. 23 శాతం ఫిట్మెంట్ ఇస్తున్నట్లు తెలిపింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ప్రభుత్వ వనరులపై ఇప్పటికే ఉద్యోగ సంఘాల నాయకులకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వివరించిన విషయం తెలిసిందే. ఈరోజు మరోసారి ఉద్యోగ సంఘాల నాయకులతో సీఎం భేటీ అయ్యారు. చర్చల అనంతరం సీఎం జగన్ ఫిట్మెంట్పై ప్రకటన చేశారు. ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.
ఉద్యోగులకు జనవరి 1, 2022 నుంచి పెంచిన జీతాలు అందనున్నాయి. ఈ నిర్ణయం వలన ప్రభుత్వంపై అదనంగా 10,247 కోట్ల భారం పడనుంది. పీఆర్సీ జూలై 1, 2018 నుంచి అమలు కానుంది. మానిటరీ బెనిఫిట్ ఏప్రిల్ 1, 2020 నుంచి అమలు కానుంది. ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. జనవరి 1, 2022 నుంచి విరమణ వయసు పెంపు అమలవ్వనుంది. అలాగే, జూన్ 30వ తేదీ లోగా కారుణ్య నియామకాలను కూడా పూర్తి చేస్తామని వెల్లడించింది. హెల్త్ స్కీమ్ అమలు చేయడంలో ఎదుర్కొంటున్న సమస్యలకు ఇంకో 2 వారాల్లో పరిష్కారం చూపుతామని సర్కార్ హామీ ఇచ్చింది.
గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ జూన్ 30లోగా ప్రొబేషన్ మరియు కన్ఫర్మేషన్ ప్రక్రియను పూర్తి చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అలాగే, సవరించిన విధంగా రెగ్యులర్ జీతాలను ఈ ఏడాది జూలై జీతంతో కలిపి ఇవ్వనున్నారు. సొంతిల్లు లేని గవర్నమెంట్ ఉద్యోగులకు.. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న జగనన్న స్మార్ట్ టౌన్షిప్స్లో ప్లాట్లను ఇవ్వనున్నారు. ఎంఐజీ లే అవుట్స్లోని ప్లాట్లలో 10శాతం ప్లాట్లను రిజర్వ్ చేయడమే కాకుండా.. 20శాతం రిబేటును ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ రిబేటును కూడా ప్రభుత్వమే భరించనుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ