ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆగస్టు 4, మంగళవారం నాడు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చేపడుతున్న నాడు-నేడు కార్యక్రమంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షకు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఆర్థిక, విద్యా శాఖలకు చెందిన పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా తొలిదశలో పలు స్కూళ్లలో చేపట్టిన పనులను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సీఎం పరిశీలించారు. అలాగే రెండో దశలో భాగంగా 14,584 పాఠశాలల్లో రూ.4732 కోట్లు వ్యయంతో వచ్చే ఏడాది జనవరి 14న పనులు ప్రారంభించి, జూన్ నెల నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు అధికారులు సీఎంకు తెలియజేశారు. నాడు-నేడు కార్యక్రమంలో ఇప్పటి వరకు 9 రకాల మార్పులు చేస్తుండగా, కొత్తగా 10వ అంశంగా కిచెన్ను కూడా చేర్చినట్టు తెలిపారు.
ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ, సెప్టెంబర్ 5 న పాఠశాలలు తిరిగి తెరవడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని, అప్పటి కల్లా నాడు-నేడు పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అదేరోజున విద్యార్థులకు అందించే జగనన్న విద్యా కానుక కిట్ను సీఎం వైఎస్ జగన్ పరిశీలించారు. జగనన్న విద్య కానుక కింద ఇచ్చే కిట్ కు సంబంధించి నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడొద్దని సూచించారు.
“జగనన్న విద్యా కానుక” కింద విద్యార్థులకు అందించే కిట్:
- పాఠ్యపుస్తకాలు
- నోట్ బుక్స్
- స్కూల్ బ్యాగ్
- 3 జతల దుస్తుల వస్త్రం
- ఒక జత షూ
- రెండు జతల సాక్స్
- బెల్టు
- మాస్క్
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu