లాక్డౌన్ 4.0 ను మే 31 వ తేదీవరకు పొడిగిస్తూ కంటైన్మెంట్ జోన్స్ ప్రాంతాల మినహా మిగతా అన్ని ప్రాంతాల్లో బస్సు సర్వీసులు నడుపుకొనేందుకు అనుమతి ఇస్తూ కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఈ రోజు (మే 21, గురువారం) ఉదయం 7 గంటలనుంచే ఆర్టీసీ బస్సు సర్వీసులు మొదలయ్యాయి. లాక్డౌన్ కారణంగా మార్చ్ 22 నాడు రాష్ట్రంలో బస్సు సర్వీసులను నిలిపివేశారు. దీంతో 58 రోజుల తర్వాత ఆర్టీసీ బస్సులు మళ్ళీ రోడ్డెక్కాయి. రాష్ట్రంలో ముందుగా 436 రూట్లలో 1,683 బస్సులు మాత్రమే ప్రారంభిస్తున్నారు. ఆర్టీసీ మొత్తం బస్సుల్లో తొలుత 17 శాతం నడిపేందుకు నిర్ణయించుకున్నారు.
ఏపీ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణాలకు కరోనా నిబంధనలు అనుసరించి పలు మార్పులు చేశారు. ఆన్లైన్లో మాత్రమే టికెట్ బుకింగ్కు అవకాశం కల్పించారు. సూపర్ లగ్జరీ సర్వీసులకే కాకుండా ఆర్డినరి, ఎక్స్ప్రెస్, అల్ట్రా డీలక్స్, డీలక్స్ బస్సులకు కూడా ఆన్లైన్ రిజర్వేషన్ సదుపాయం కల్పిస్తున్నారు. ఆర్టీసీ లో అన్ని రకాల రాయితీ ప్రయాణాల్ని తాత్కాలికంగా నిలిపేశారు. ప్రతి ప్రయాణికుడు మొబైల్లో ఆరోగ్య సేతు యాప్ కలిగి ఉండాలని చెప్పారు. కేవలం టిక్కెట్ ఉన్న ప్రయాణికుడిని మాత్రమే బస్టాండ్లోకి అనుమతించనున్నారు.
ముందుగా భౌతిక దూరం పాటించేలా సీట్లలో మార్పులు చేశారు. సూపర్ డీలక్స్, లగ్జరీ బస్సుల్లో సీట్లను కుదించి, పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో కొన్ని సీట్లలో కూర్చోకుండా మార్క్ చేశారు. అలాగే బస్సు సర్వీసులను జిల్లాలు, డిపోల మధ్య మాత్రమే నడపనున్నారు. మధ్యలో బస్సులు ఆపడం, ప్రయాణికులను ఎక్కించుకునే విధానాన్ని కొంతకాలం అనుమతించకూడదని నిర్ణయించారు. ప్రయాణికులంతా తప్పనిసరిగా మాస్క్లు ధరించాలని చెప్పారు. బస్టాండ్లలోనే మాస్క్లు అందుబాటులో ఉంచి, 10 రూపాయలకు మాస్క్ అమ్మాలని నిర్ణయించారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం 65 ఏళ్ల పైబడిన వృద్ధులు, 10 ఏళ్ల లోపు చిన్న పిల్లలను కేవలం అత్యవసర పనులు, వైద్య సేవల నిమిత్త ప్రయాణాలకు మాత్రమే అనుమతిస్తారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu