తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు 24వ వర్ధంతి సందర్భంగా బేగంపేటలోని రసూల్పురా కూడలి వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. ఎన్టీఆర్ తనయుడు నందమూరి రామకృష్ణ, నందమూరి సుహాసిని, తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, రావుల చంద్రశేఖర్రెడ్డి, ఇతర నాయకులు ఎన్టీఆర్ కు నివాళులు అర్పించారు. అనంతరం రసూల్పూర కూడలిలోని ఎన్టీఆర్ విగ్రహం నుంచి ట్యాంక్ బండ్ దగ్గరున్న ఎన్టీఆర్ ఘాట్ వరకు సాగే ఎన్టీఆర్ అమర జ్యోతి ర్యాలీని ప్రారంభించారు. పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు.
మరో వైపు ఎన్టీఆర్ 24వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, దగ్గుబాటి పురంధేశ్వరి, తదితరులు నివాళులర్పించారు. రెండు రాష్ట్రాలలోని పలు ప్రాంతాల నుంచి నాయకులు, కార్యకర్తలు ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకొని నివాళులు అర్పించారు. అలాగే గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో ఎన్టీఆర్ వర్థంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కార్యాలయం ప్రాంగణంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు, పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొని ఎన్టీఆర్కు నివాళులర్పించారు. అనంతరం ఎన్టీఆర్ రక్తదాన శిబిరాన్ని చంద్రబాబు నాయుడు ప్రారంభించారు.
[subscribe]