ఉండవల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అద్దెకు ఉంటున్న నివాసానికి సీఆర్డీఏ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేసారు. ఈ మేరకు చంద్రబాబు నివసించే భవనం గోడకు సీఆర్డీఏ అధికారులు నోటీసులు అంటించారు. గతంలో జారీ చేసిన నోటీసులకు ఇంటి యజమాని అయినా లింగమనేని రమేష్ నుంచి ఎలాంటి వివరణ లభించలేదని తాజాగా జారీచేసిన నోటీసులో పేర్కొన్నారు. వారం రోజుల్లోగా స్పందించి అక్రమ కట్టడాలను తొలగించాలని లేని పక్షంలో తామే తొలిగిస్తామని లింగమనేని రమేష్ కు అధికారులు తెలిపారు. స్విమ్మింగ్ పూల్, లివింగ్ రూమ్ లాంటివి ఇచ్చిన అనుమతులకు వ్యతిరేకంగా నిర్మించారని పేర్కొన్నారు.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరకట్ట వెంబడి అక్రమ కట్టడాలపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన ప్రజావేదికను కూల్చివేశారు. ఆ సమయంలోనే కృష్ణా నదికి భారీగా వరద వస్తే కరకట్ట వెంట ఉన్న భవనాలకు వరద ముంపు ప్రమాదముందని తాడేపల్లి తహశీల్దార్ పేరుతో చంద్రబాబు నివాసానికి కూడ నోటీసులు జారీ చేసారు. అప్పటి నుంచి ఈ విషయంపై దుమారం నడుస్తూనే ఉంది, ఈ క్రమంలో మరోసారి నోటీసులు ఇవ్వడంతో ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో అని అందరూ వేచి చూస్తున్నారు.
[subscribe]