ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పోలవరం ప్రాజెక్టు పనుల విషయంలో రివర్స్ టెండరింగ్ కు వెళ్లాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఏపీ జలవనరుల శాఖ నిర్వహించిన రివర్స్ టెండరింగ్ లో పోలవరం ప్రాజెక్టు లెఫ్ట్ కనెక్టివిటీకి సంబంధించిన 65వ ప్యాకేజి పనులను రూ.231.47 కోట్లకు మ్యాక్స్ ఇన్ఫ్రా సంస్థ దక్కించుకుంది. 2019 లో నిర్వహించిన టెండర్లలోనూ రూ.292.09 కోట్లకు ఈ సంస్థే పనులను దక్కించుకోవడం విశేషం. ఈ బిడ్ కోసం ఆరు సంస్థలు పోటీపడగా 15.6 శాతం తక్కువకి మ్యాక్స్ ఇన్ఫ్రా సంస్థ టెండర్ దాఖలు చేసి పనులు దక్కించుకుంది. గతంలో చంద్రబాబు హయాంలో ఇదే సంస్థ అంచనాల కన్నా 4.8 శాతం ఎక్కువకు టెండర్ దాఖలు చేసింది. రివర్స్ టెండరింగ్ విధానం ద్వారా ప్రభుత్వానికి రూ.58 కోట్లు ఆదా కానున్నాయి.
పోలవరం ప్రాజెక్టులో టీడీపీ ప్రభుత్వం చేసిన అవినీతి బయటపడిందని జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. కేవలం రూ.300 కోట్ల పనుల్లోనే రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రభుత్వానికి రూ.58 కోట్లు మిగిలాయని చెప్పారు. రివర్స్ టెండరింగ్ పై చంద్రబాబు అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఇంకా రూ. 36 వేల కోట్ల పనులు చేయాల్సి ఉంటే చంద్రబాబు మాత్రం పోలవరం పూర్తి చేసినట్లు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. పోలవరం ప్రాజెక్టు పనులను నవంబర్ 1 నుంచి ప్రారంభిస్తామని, తప్పుడు ప్రచారాలు చేయవద్దని సూచించారు.
[subscribe]