కరీంనగర్ కు చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు శుక్రవారం నాడు తెలంగాణ భవన్ లో నిర్వహించిన సమావేశంలో టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్ బీజేపీ పార్టీపై మండిపడ్డారు. బీజేపీ పార్టీ అడ్డిమార్ గుడ్డిదెబ్బన నాలుగు ఎంపీ సీట్లు గెలిచి వీర్రవీగుతుందని చెప్పారు. నాలుగు ఎంపీ సీట్లు గెలిచిన బీజేపీ తరువాత వచ్చిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలలో కేవలం ఏడు సీట్లు మించి గెలవలేకపోయారని, దారి తప్పి గెలవడం వలనే ఎక్కడా ఆగడం లేదని విమర్శించారు. త్వరలో జరిగే కార్పొరేషన్ ఎన్నికల్లో వాళ్లకు అసలు విషయం తెలుస్తుందని చెప్పారు. శాసనసభ ఎన్నికల్లో ఘనవిజయం సాధించడంతో వచ్చిన మితిమీరిన ఆత్మ విశ్వాసం కారణంగానే పార్లమెంట్ ఎన్నికలలో సీట్లు తగ్గాయని చెప్పారు.
మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో కరీంనగర్ నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కర్ర రాజశేఖర్, ఆయన అనుచరులు కేటీఆర్ సమక్షంలో టిఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, కేసీఆర్ ప్రజల మనస్సు గెలిచిన గొప్ప నాయకుడని అన్నారు. కేసీఆర్ కు కరీంనగర్ అంటే ఏంతో ఇష్టమని అందుకే ఉమ్మడి కరీంనగర్ జిల్లా మీద నాలుగు మంత్రి పదవులు ఇచ్చారని చెప్పారు. కేసీఆర్ ను జైలుకు పంపిస్తామని బీజేపీ నేతలు ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని, ఆయనే కనుక తప్పు చేసుంటే గతంలో ముఖ్యమంత్రులుగా చేసిన రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి వదిలిపెట్టేవారా అని కేటీఆర్ ప్రశ్నించారు. టిఆర్ఎస్ ఒక కులానికో, మతానికో పరిమితం కాదని, ఇది అందరి పార్టీ అని కేటీఆర్ పేర్కొన్నారు.
[subscribe]