ఆంధ్రప్రదేశ్ జీవనాడిగా పేరొందిన పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి పలు అంశాలపై చర్చించేందుకు కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) నేతృత్వంలో పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) భేటీ అయింది. బుధవారం హైదరాబాద్లోని కృష్ణా-గోదావరి భవన్లో పీపీఏ సీఈఓ చంద్రశేఖర్ అయ్యర్ అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి ఏపీ జలవనరుల శాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఏపీ, తెలంగాణ ఈఎన్సీలు నారాయణ రెడ్డి మరియు మురళీధర్ సహా రెండు రాష్ట్రాల జలవనరుల శాఖ అధికారులు హాజరయ్యారు. అలాగే వీరితో పాటు కేంద్ర జల సంఘం ప్రతినిధులు కూడా ఈ సమావేశంలో పాల్గొంటున్నారు.
హైదరాబాద్లో ఉన్న పోలవరం ప్రాజెక్టు అథారిటీని(పీపీఏ) కార్యాలయాన్ని రాజమండ్రికి తరలించాలనే ఏపీ ప్రభుత్వం ప్రతిపాదనపై ఈ సమావేశంలో చర్చకు రానుంది. అలాగే ముఖ్యంగా భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాలో పోలవరం బ్యాక్ వాటర్ ప్రభావంపై చర్చించనున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు భద్రాద్రి జిల్లాకు వరద పోటెత్తడం, అనేక గ్రామాలూ జలదిగ్బంధంలో చిక్కుకుపోవడం వలన ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. దీంతోపాటు భద్రాచలం పట్టణం ముంపు ముంగిట నిలవడం ప్రజలతో పాటు తెలంగాణ అధికార యంత్రాంగాన్ని కలవర పరిచింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ 827 ఎకరాలకు పైగా రాష్ట్రానికి చెందిన భూమి మునిగిపోతోందని రిపోర్ట్ ఇచ్చింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం దీనిపై స్వతంత్ర సంస్థతో పూర్తి అధ్యయనం చేయించాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీని కోరుతోంది. వీటన్నింటిపై నేటి సమావేశంలో ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ