పాపికొండల యాత్రలో పెను విషాదం చోటు చేసుకుంది. ఆదివారం ఉదయం 64 మంది పర్యాటకులు, 9 మంది సిబ్బందితో కూడిన పర్యాటక బోటు పాపికొండల యాత్రకు వెళ్తూ, తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలంలోని కచ్చులూరు వద్ద గోదావరిలో అత్యంత లోతైన ప్రాంతంలో ప్రవాహం అధికంగా ఉండడంతో మునిగిపోయింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కు చెందిన పర్యాటకులు గల్లంతు కావడంతో ఈ ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. లైఫ్ జాకెట్లు ధరించి నీటిలో తేలియాడుతున్న 26 మందిని స్థానికంగా ఉన్న యువకులు సహాయకచర్యల్లో పాల్గొని రక్షించారు. ఇప్పటికి 8 మంది మరణించినట్టు అధికారులు దృవీకరించగా, గల్లంతయిన మిగతా 36 మంది కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. హైదరాబాద్ నుంచి 22 మంది యాత్రికులు ఈ పర్యటనకు వెళ్లగా, ఇప్పటి సమాచారం ప్రకారం 8 మంది గల్లంతయ్యారు, ఒకరు మృతి చెందారు. వరంగల్ నుంచి వెళ్లిన 14 మందిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తుంది. ప్రత్యేక బృందాలు, హెలీకాఫ్టర్లతో ప్రభుత్వం వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టింది.
దేవీపట్నం బోటు ప్రమాద ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. ప్రమాదంపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, నేవి, ఓఎన్జీసీ హెలీకాఫ్టర్లను తక్షణమే సహాయకచర్యల్లో పాల్గొనాలని ఆదేశించారు. ఘటనా స్థలంలో పరిస్థితులను సమీక్షించాలని మంత్రులను ఆదేశించారు. జరిగిన ప్రమాదాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందని, బాధిత కుటుంబాలకు రూ.10 లక్షలు చొప్పున పరిహారం ఇస్తున్నట్టు ప్రకటించారు. బోటు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించేందుకు సీఎం జగన్ సోమవారం ఉదయం బయలుదేరి వెళ్లారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బోటు ప్రమాదం పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసి, మృతి చెందిన వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసారు. మృతుల్లో తెలంగాణ వాసులు కూడ ఉండడంతో మంత్రులు, సంబంధిత అధికారులను అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఐదు లక్షల రూపాయలు చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.
[subscribe]
[youtube_video videoid= D5eTJ9zo8t8]