బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శనివారం నాడు హిందీ దివస్ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా దుమారం లేపాయి. అమిత్ షా హిందీ దివస్ శుభాకాంక్షలు తెలుపుతూ భారతదేశంలో అనేక భాషలున్నాయని, దేనికదే ప్రత్యేకతను కలిగివుంటాయని కాకుంటే అంతర్జాతీయంగా భారతదేశానికి విశిష్ట గుర్తింపు ఉండేలా దేశవ్యాప్తంగా ఒకే భాష ఉండాలని అన్నారు. దేశంలో ఎక్కువమంది మాట్లాడే హిందీ భాష వల్లే అది సాధ్యమవుతుందని అమిత్ షా అన్నారు. ప్రతి ఒక్కరూ మాతృభాషతో పాటు హిందీని కూడ ఉపయోగించాలని, అప్పుడే స్వాతంత్ర్య సమరయోధులు మహాత్మాగాంధీ, వల్లభాయ్ పటేల్ ఆశయాలు, కలలు నెరవేర్చగలుగుతామని పేర్కొన్నారు.
అమిత్ షా చేసిన ఈ ప్రకటనపై డీఎంకే అధినేత స్టాలిన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. హిందీ భాషను బలవంతంగా రుద్దడంపై డీఎంకే ముందునుంచి వ్యతిరేకిస్తూ వస్తుందని, అమిత్ షా వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసారు. తమ పార్టీలో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని స్టాలిన్ తెలిపారు. కర్ణాటకలోనూ అమిత్ షా వ్యాఖ్యలకు వ్యతిరేకంగా భాషాభిమానులు ఆందోళనకు దిగారు. కర్ణాటక కాంగ్రెస్ పార్టీ నేతలు స్పందిస్తూ ఒకే భాష విధానాన్ని వ్యతిరేకిస్తున్నామని, భారతదేశం అనేక భాషలు, సంస్కృతి సంప్రదాయాలకు నిలయమని చెప్పారు. తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ స్పందిస్తూ ఎన్ని భాషలున్న మాతృభాషకే అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఇతర భాషల్ని సమానంగా గౌరవించాలని సూచించారు. అమిత్ షా వ్యాఖ్యలతో మళ్ళీ ఒకే దేశం-ఒకే భాష పై చర్చలు మొదలయ్యాయి, దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల నాయకులు స్పందిస్తున్నారు.
[subscribe]
[youtube_video videoid=atZEhPQ0ZWc]