తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి ఫిబ్రవరి 29, శనివారం నాడు ప్రత్యేక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో టీటీడీ వార్షిక బడ్జెట్ కు ఆమోదం తెలిపారు. 2020-2021 సంవత్సరానికి గాను రూ.3,309 కోట్ల వార్షిక బడ్జెట్కు పాలకమండలి ఆమోద ముద్ర వేసింది. గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి బడ్జెట్ అంచనాలు రూ.60 కోట్లకు పెరిగినట్టు పేర్కొన్నారు. హుండీ ద్వారా రూ.1,351 కోట్లు ఆదాయం, వడ్డీల ద్వారా రూ.706 కోట్లు, ఇక లడ్డు ప్రసాదాల విక్రయాల ద్వారా రూ.400 కోట్ల ఆదాయం వస్తుందని టీటీడీ అంచనా వేసింది. సమావేశం అనంతరం బడ్జెట్కు సంబంధించిన పలు వివరాలను టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు.
టీటీడీ పాలకమండలి వార్షిక బడ్జెట్ లో భాగంగా తీసుకున్న నిర్ణయాలు:
- బుందీపోటులో తరుచూ జరుగుతున్న అగ్నిప్రమాదాలు నివారణకు రూ.3.30 కోట్లు
- 34 కోట్లతో ఎస్వీ భజన పాఠశాల ఏర్పాటు
- జూపార్క్ సమీపంలో రూ.14 కోట్లతో ప్రతిభావంతులకు శిక్షణా కేంద్రం ఏర్పాటు
- అలిపిరి రోడ్డు విస్తరణ కోసం రూ.16 కోట్లు కేటాయింపు
- బర్డ్ ఆస్పత్రిలో మెరగైన సదుపాయాలు కోసం రూ. 8.5 కోట్లు
- టీటీడీ విజిలెన్స్ శాఖలో సెక్యూరిటీ గార్డ్ పోస్టుల భర్తీ ఆమోదం
- టీటీడీ ఆలయాలు, వాటి పరిధిలోని పబ్లిక్ ప్రాంతాల్లో 1500 సీసీ కెమెరాల ఏర్పాటు
- చెన్నైలో పద్మావతి ఆలయ నిర్మాణానికి రూ.3.92 కోట్లు కేటాయింపు
- అలిపిరి వద్ద ద్విచక్రవాహనాలకు రుసుం మినహాయింపు
- హైదరాబాద్ జూబ్లీహిల్స్లో శ్రీవారి ఆలయ నిర్మాణం, వాహన మండపం నిర్మాణానికి ఆమోదం
- జమ్మూకశ్మీర్, ముంబై, కాశీలలో శ్రీవారి ఆలయాల నిర్మాణానికి ఆమోదం
- టీటీడీ సైబర్ సెక్యూరిటీ వింగ్ను ప్రారంభించాలని నిర్ణయం.
[subscribe]