భారత టాప్ బాక్సర్లు మేరీకోమ్ (51 కేజీలు), అమిత్ పంగాల్ (52 కేజీలు), సిమ్రన్జిత్ కౌర్ (60 కేజీలు) టోక్యో ఒలింపిక్స్కు అర్హత సాధించారు. ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్లో మార్చ్ 9, సోమవారం నాడు ఈ ముగ్గురు విజయం సాధించి సెమీఫైనల్ కు చేరుకోవడంతో నేరుగా టోక్యో ఒలింపిక్స్కు అర్హత సాధించారు. రెండో సీడ్ మేరీ కోమ్ 51 కేజీలు విభాగంలో ఫిలిప్పీన్స్ క్రీడాకారిణి ఐరిష్ మాగ్నోపై 5-0 తేడాతో విజయం సాధించింది. సెమీఫైనల్లో చైనాకు చెందిన యూన్ చాంగ్తో మేరీకోమ్ తలపడనుంది. 2012లో లండన్ లో జరిగిన ఒలింపిక్స్లో మేరీ కోమ్ కాంస్య పతకాన్ని సాధించిన సంగతి తెలిసిందే.
ఇక ప్రపంచ బాక్సింగ్ రజత పతక విజేత అమిత్ పంగాల్ 52 కేజీల విభాగంలో ఫిలిప్పీన్స్ కు చెందిన కార్లో పాలమ్ ను 1-4 తేడాతో ఓడించి సెమీఫైనల్ కే చేరుకున్నాడు. ఈ విజయంతో టోక్యో ఒలింపిక్స్కు అర్హత సాధించాడు. మరోవైపు ఇదే టోర్నమెంట్ లో పంజాబ్కు చెందిన సిమ్రన్జిత్ 5–0తో మంగోలియాకు చెందిన రెండో సీడ్ నమున్ మోన్ఖోర్ పై ఘనవిజయం సాధించి టోక్యో ఒలింపిక్స్కు అర్హత సాధించారు. సిమ్రన్జిత్ తొలిసారిగా ఒలింపిక్స్ లో బెర్త్ దక్కించుకుంది. ఈ క్వాలిఫయింగ్ టోర్నమెంట్ ద్వారా ఇప్పటివరకు భారత్ నుంచి ఈ ముగ్గురితో పాటుగా సతీష్ కుమార్ (+ 91 కేజీలు), పూజా రాణి (75 కేజీలు), వికాస్ క్రిషన్ (69 కేజీలు), లోవ్లినా బోర్గోహైన్ (69 కేజీలు), ఆశిష్ కుమార్ (75 కేజీలు)తో కలిపి మొత్తం ఎనిమిది మంది బాక్సర్లు టోక్యో ఒలింపిక్స్కు అర్హత సాధించడం విశేషం.