త్వరలో ఖాళీ అయినా రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మార్చ్ 9, సోమవారం నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎన్నికలకు అభ్యర్థులను ఖరారు చేసింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్చంద్రబోస్, మంత్రి మోపిదేవి వెంకటరమణ, వైసీపీ సీనియర్ నాయకుడు అయోధ్య రామిరెడ్డితో పాటుగా పరిమల్ నత్వానిలకు వైసీపీ రాజ్యసభ సీట్లను కేటాయించింది. వీరిలో ముగ్గురు వైసీపీ నాయకులు కాగా, పరిమల్ నత్వాని రిలయన్స్ ఇండస్ట్రీస్లో కార్పొరేట్ వ్యవహారాల విభాగం అధ్యక్షుడుగా వ్యవరిస్తున్నారు.
ఏపీ ప్రభుత్వం శాసన మండలి రద్దుకు తీర్మానం చేసి కేంద్రానికి పంపిన సంగతి తెలిసిందే. రద్దు తీర్మానానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపితే, మండలిలో సభ్యులైన పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణలు మంత్రి పదవులు కోల్పోవలసి వస్తుంది. ఈ నేపథ్యంలో వారికి రాజ్యసభకు అవకాశం కల్పించినట్టుగా తెలుస్తుంది. అలాగే గత ఎన్నికల్లో పార్టీ టికెట్ వదులుకుని, పార్టీ విజయం కోసం కృషి చేసిన సీనియర్ నాయకుడు అయోధ్య రామిరెడ్డికి రాజ్యసభ టికెట్ ను కేటాయించారు. ఇక రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ ఇటీవలే తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ను కలుసుకున్న సమయంలో చేసిన అభ్యర్ధన మేరకు పరిమల్ నత్వానికి రాజ్యసభ సీటును కేటాయించినట్టుగా తెలుస్తుంది. రాష్ట్రంలో రిలయన్స్ కంపెనీ ద్వారా పరిశ్రమల స్థాపన, అభివృద్ధికి కృషి చేస్తామని ఆ సందర్భంగా ముకేశ్ అంబానీ హామీ ఇచ్చినట్టుగా సమాచారం.
[subscribe]