టీడీపీ నేత, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి అక్టోబర్ 21, సోమవారం ఉదయం బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో బీజేపీ పార్టీలో చేరి, కాషాయ కండువా కప్పుకున్నారు. ఆయనను బీజేపీ పార్టీలోకి జేపీ నడ్డా స్వాగతించారు. 2014 అసెంబ్లీ ఎన్నికలలో జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి వైసీపీ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం టీడీపీ పార్టీలో చేరి మంత్రి పదవిని దక్కించుకున్నారు. టీడీపీలో కీలక నేతగా వ్యవహరించిన ఆయన 2019లో జరిగిన ఎన్నికలలో కడప లోక్ సభ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి పరాజయం పొందారు. అదే ఎన్నికల్లో టీడీపీ పార్టీ కూడ ఘోర పరాజయం పొందడంతో గత కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాలకు సైతం దూరంగా ఉంటూ వస్తున్నారు.
ఆదినారాయణరెడ్డి బీజేపీ పార్టీలో చేరుతున్నట్లుగా చాలాకాలం నుంచి ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఇటీవలే ఢిల్లీ వెళ్లిన ఆయన బీజేపీ పార్టీ హైకమాండ్తో చర్చలు జరిపారు. ఈ రోజు ఢిల్లీలో ఆయనకు కండువా కప్పిన జేపీ నడ్డా పార్టీలోకి స్వాగతం చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వచ్చిన కొన్ని నెలలకే టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులతో పాటు కొంతమంది నాయకులు కూడ బీజేపీ తీర్ధం పుచ్చుకున్న సంగతి తెలిసిందే.
[subscribe]