ఏపీ సీఆర్డీయే చట్టాలను మార్చి కూడా పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన జగన్ ప్రభుత్వం ఇప్పుడు ఇళ్ల నిర్మాణం విషయంలో మాత్రం ముందుకెళ్లే మార్గాన్ని అన్వేషిస్తోంది. నెలక్రితమే ముహూర్తం ఖరారు చేసినా ప్రస్తుతం దానిని వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. న్యాయపరమైన చిక్కులు, ఇతర సమస్యల కారణంగా ఆది వాయిదా పడినట్టు కనిపిస్తోంది. జూలై 8 వైఎస్సార్ జయంతి సందర్భంగా ఇళ్ల నిర్మాణం ప్రారంభిస్తామంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గత నెలలో పట్టాల పంపిణీ సందర్భంగా ప్రకటించారు. ఆ తర్వాత కూడా దానిని పునరుద్ఘాటించారు.
కానీ తీరా ఇప్పుడు అది ఆచరణ రూపం దాల్చడం లేదు. దాంతో ముఖ్యమంత్రి తన పర్యటనను సైతం అనంతపురం మార్చుకున్నారు. జూలై 8 రైతు దినోత్సవ సభ అనంతపురంలో ఏర్పాటు చేస్తున్నారు. అక్కడి నుంచి సీఎం జగన్ ఇడుపులపాయ వెళతారు. వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పిస్తారు. ఆయన షెడ్యూల్ లో అమరావతి ప్రాంతంలో పంపిణీ చేసిన స్థలాల్లో ఇళ్ల నిర్మాణం లేదు. ఇది ఆసక్తికరంగా మారింది.
గతంలో ఈ విషయంలో అమరావతి జేఏసీ అభ్యంతరాల నేపథ్యంలో పట్టాల పంపిణీకి అడ్డంకులు లేవని సుప్రీంకోర్టు తెలిపింది. దాంతో మూడేళ్ల పాటు నాన్చిన తర్వాత రాజధానిలో పేదలకు సెంటు స్థలం చొప్పున పట్టాలు అందించారు. అక్కడే పేదలకు ఇళ్లు నిర్మించి ఇస్తామని కూడా ప్రభుత్వం చెప్పింది. అదే సమయంలో ఇళ్ళ నిర్మాణం విషయంలో అభ్యంతరాలు చెబుతూ రైతుల తరుపున మరోసారి హైకోర్టుని ఆశ్రయించారు. ఇళ్ల నిర్మానానికి సుప్రీంకోర్టు అంగీకరించిందా అంటూ తాజాగా ఏపీ హైకోర్టు నుంచి ప్రభుత్వానికి ప్రశ్నలు వచ్చాయి. వాటికి సమాధానం ఇవ్వాలంటూ కోర్టు ఆదేశించింది.
ఈ స్పష్టత రాకుండా ఇళ్ళ నిర్మాణానికి పూనుకుంటే అది కొత్త సమస్యకు దారితీస్తుందని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు కనిపిస్తోంది. దాంతో ఏకపక్షంగా ముందుకెళ్లే ప్రయత్నాలు విరమించుకుంది. తాజాగా ఇళ్ల నిర్మాణా పనులకు ముహూర్తం పెట్టినప్పటికీ దానిని వాయిదా వేసింది. తదుపరి ఎప్పుడు ఈ వ్యవహారం ప్రారంభమవుతుందన్నది కీలకాంశంగా ఉంది. ఎన్నికల ముందు ఈ ప్రక్రియ పూర్తి చేసి ఇళ్ల నిర్మాణం విషయంలో వేగంగా అడుగులు పడాలని జగన్ ఆశిస్తున్నారు. కానీ పరిస్థితులు ఏమేరక సహకరిస్తాయన్నది ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE