రాష్ట్రంలో రోడ్లపై సభలు, ర్యాలీలపై నిషేధం విధిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో జాతీయ, రాష్ట్ర రహదారులపై సభలకు ఎలాంటి అనుమతులు ఇవ్వరాదని, అలాగే మున్సిపల్, పంచాయతీ రోడ్లపై కూడా సభలు, ర్యాలీలు వంటి కార్యక్రమాలు నిర్వహించరాదని జీవోలో పేర్కొన్నారు. ఈ నిర్ణయంపై రాజకీయ వర్గాల్లో పెద్దఎత్తున చర్చ జరుగుతుంది. ఈ నిర్ణయంపై తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందిస్తూ, జీవో 1 లాంటివి ఉంటే గతంలో సీఎం వైఎస్ జగన్ పాదయాత్ర చేసేవారా? అని ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
ప్రతిపక్ష పార్టీల గొంతు వినిపించకూడదు, ఆ పార్టీలు కార్యక్రమాలు నిర్వహించకూడదు అనే ఉద్దేశంతోనే జీవో 1ని తీసుకువచ్చారని, ఇటువంటి జీవో గతంలో ఉండి ఉంటే సీఎం జగన్ నాడు ప్రతిపక్ష నాయకుడిగా పాదయాత్ర చేయగలిగేవారా? అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. “ప్రజా వ్యతిరేక విధానాలను పాలకులు అమలు చేస్తుంటే ప్రజా పక్షం వహించడం ప్రతిపక్ష పార్టీలుగా మా బాధ్యత. ఇలాంటి చీకటి ఉత్వరులు ఇవ్వకుండానే అందులోని దురుద్దేశాలను విశాఖ నగరంలో అక్టోబరులోనే వెల్లడించారు. వాహనంలో నుంచి కనిపించకూడదు. ప్రజలకు అభివాదం చేయకూడదు అని, హోటల్ నుంచి బయటకు రాకూడదు అని నిర్బంధాలు విధించారు. ఇప్పటం వెళ్లరాదని అటకాయించారు. ఆ పెడ పోకడలనే అక్షరాల్లో ఉంచి జీవో ఇచ్చారు” అని పవన్ కళ్యాణ్ అన్నారు.
ఈ ఉత్తర్వులు బూచి చూపి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుని కుప్పం పర్యటన చేయకుండా అడ్డుకున్నారని, ప్రభుత్వ వైఖరిని ఖండిస్తున్నానని అన్నారు. “ఈ విధమైన చర్యలు ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తాయి. చంద్రబాబు ఎమ్మెల్యేగా తన నియోజక వర్గంలో పర్యటించి ప్రజలను కలవడం ఆయన విధి. ఆయన విధులను జీవో 1 ద్వారా అడ్డుకొంటున్నారా?, ఈ ఉత్తర్వులు సీఎం జగన్ కు వర్తిస్తాయా? లేవా? నిన్నటి రోజున రాజమహేంద్రవరంలో జనాన్ని రోడ్డుకు ఇరువైపులా నిలబెట్టి ఆయన చేసిన షో ఈ ఉత్తర్వుల ఉల్లంఘన పరిధిలోకి వస్తుందో రాదో పోలీసు ఉన్నతాధికారులు వివరణ ఇవ్వాలి. చీకటి జీవోలతో రాష్ట్రంలో క్రమంగా నియంతృత్వం తీసుకువస్తున్న పాలకుల విధానాలను ప్రజాస్వామ్యవాదులు ప్రశ్నించాలి” అని పవన్ కళ్యాణ్ అన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE