రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం విస్తరణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. నవంబర్ 15, శుక్రవారం నాడు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీకి విస్తరణకు సంబంధించిన కొత్త మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. వార్షిక ఆదాయం రూ.5 లక్షల వరకు ఉన్న వారికీ కూడ ఈ పథకాన్ని వర్తింపజేస్తూ ఆదేశాలు జారీ చేశారు. అన్ని రకాల బియ్యం కార్డులు కలిగిన వారు, వైఎస్ఆర్ పింఛన్ కార్డు, జగనన్న విద్యా వసతి దీవెన కార్డులు ఉన్న కుటుంబాలను కూడ ప్రభుత్వం అర్హులుగా చేర్చింది. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నగరాల్లోని 130 ఆసుపత్రుల్లో కూడ ప్రజలు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ సేవలు పొందేలా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇటీవలే నిర్ణయం తీసుకున్నారు. వీటితో పాటు ఇతర కుటుంబాలకు వర్తించే ప్రమాణాలను కూడా ప్రభుత్వం విడుదల చేసింది.
ఇతర కుటుంబాలకు వర్తించే ప్రమాణాలు:
- 12 ఎకరాల మాగాణి లేదా 35 ఎకరాల లోపు మెట్ట భూమి ఉన్న వారు ఈ పథకానికి అర్హులు
- మాగాణి, మెట్ట మొత్తం కలిపి 35 ఎకరాల లోపు ఉన్నవారంతా అర్హులు
- కుటుంబంలో ఒక కారు ఉంటే అర్హులు, ఒకటి కన్నా ఎక్కువ కార్లు ఉంటే పథకానికి అనర్హులు
- వార్షిక ఆదాయం 5 లక్షల వరకు ఉన్న వ్యక్తులు అర్హులు, అదే విధంగా 5 లక్షల వరకు ఆదాయపు పన్ను దాఖలు చేస్తున్న కుటుంబాలు కూడ అర్హులు
- 5 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉండే పార్ట్టైమ్ ఉద్యోగులు, పారిశుద్ధ్య కార్మికులు, అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు ఈ పథకానికి అర్హులు
- ప్రభుత్వ రంగంలో పని చేస్తూ గౌరవ వేతనం పొందుతున్న ఉద్యోగులు, ప్రైవేటు ఉద్యోగులు అర్హులు
[subscribe]