ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగులకు, ప్రభుత్వానికి మధ్య దూరం పెరుగుతోంది. గత కొన్ని నెలలుగా ఉద్యోగుల కంట్రిబ్యూటరీ స్కీం (సీపీఎస్)పై వివాదం నడుస్తోన్న సంగతి తెలిసిందే. పలు దఫాలుగా దీనిపై ప్రభుత్వం ఉద్యోగ సంఘాల నాయకులతో సమావేశాలు జరిపినా ఏకాభిప్రాయానికి రాలేకపోతున్నారు. ఈ క్రమంలో.. మంగళవారం చర్చలకు వచ్చిన ఉద్యోగ సంఘాలు ప్రభుత్వ వైఖరిపై అసహనం వ్యక్తం చేశాయి. ఒకవైపు తాము పాత విధానాన్నే కొనసాగించాలని కోరుతుంటే, మరోవైపు ప్రభుత్వం మాత్రం జీపీఎస్ విధానం అంటూ మాట్లాడుతోందని మండిపడ్డారు. దీన్ని ఎట్టిపరిస్థితుల్లో ఉద్యోగులు ఒప్పుకోరని, ప్రభుత్వం ఇదే వైఖరిని కొనసాగిస్తే తాము మరోసారి చర్చలకు కూడా రామని తెలిపారు. ఈ నేపథ్యంలో బుధవారం మళ్ళీ ఇంకోసారి చర్చలకు రావాలని ఉద్యోగ సంఘాల నాయకులను ప్రభుత్వం కోరింది. కానీ ఈరోజు ఇప్పటివరకు ఎవరూ ఈ భేటీకి రాకపోవడం గమనార్హం.
దీంతో ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. నేటి సమావేశం అధికారికమైనదని పేర్కొన్న మంత్రి దీనిపై అన్ని సంఘాలకు సమాచారమిచ్చామని తెలిపారు. నిన్నటి సమావేశంలో జీపీఎస్పై తమకున్న అభ్యంతరాలను తెలపాలని కోరామని, అయితే ఉద్యోగ సంఘాలు మాత్రం స్పందించకపోవడం సరికాదని అన్నారు. అయితే ఉద్యోగ సంఘాల నేతలు సమావేశానికి రాకపోతే, ప్రభుత్వం సూచించిన విధానాన్ని వారు అనుకూలమని భావించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. అలాగే దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని ప్రకటిస్తుందని స్పష్టం చేశారు. ఎన్నికలకు ముందు సీఎం జగన్ సీపీఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చినమాట వాస్తవమేనని, అయితే సాధ్యాసాధ్యాలను పరిశీలించాక దేనిని అమలు చేయడంలో అనేక రకాల ఇబ్బందులను గుర్తించి జీపీఎస్ విధానానికి మొగ్గుచూపారని వివరించారు. ఉద్యోగులకు సీపీఎస్ కంటే మెరుగైన విధానం అమలుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అర్ధం చేసుకోవాలని మంత్రి బొత్స కోరారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ