ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ, వార్డు సచివాలయాల శాశ్వత ఉద్యోగాల ప్రక్రియలో పరీక్ష పత్రాలు లీకేజి అయ్యానంటూ ఆరోపణలు రావడంతో ఒక్కసారిగా ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. సెప్టెంబర్ 1 నుంచి 8వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించగా, సెప్టెంబర్ 19 గురువారం నాడు పరీక్ష ఫలితాలను అధికారులతో కలిసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే పరీక్షలు నిర్వహించక ముందే ప్రశ్న పత్రాలు లీకు అయినట్టు, అందులో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సి) అధికారుల,ఉద్యోగుల హస్తముందని పలు మాధ్యమాల్లో వార్తలు రావడంతో ఒక్కసారిగా అలజడి మొదలయింది. టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పరీక్ష రాసిన పలువురు అభ్యర్థులు ఏపీపీఎస్సి కార్యాలయాన్ని ముట్టడించారు, పరీక్ష రద్దు చేయాలనీ డిమాండ్ చేసారు. పోలీసులు వారిని అరెస్ట్ చేసి ఏపీపీఎస్సి కార్యాలయం ఎదుట భారీ బందోబస్తు ఏర్పాటు చేసారు.
గ్రామ, వార్డు సచివాలయాల పరీక్షలను ఎంతో పకడ్బందీగా, జాగ్రత్తలు తీసుకుని నిర్వహించామని పంచాయితీరాజ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. ప్రశ్న పత్రాల లీకేజి అంటూ వార్తల వస్తున్న నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన ఆయన పరీక్షలను పూర్తీ పారదర్శకంగా నిర్వహించామని, ప్రశ్నపత్రాల లీకేజికి ఎలాంటి అవకాశమే లేదని చెప్పారు. ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీయడానికే కొందరు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. మరో వైపు ఈ అంశంపై నారా లోకేష్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. పేపర్ లీకుతో 18 లక్షలమంది నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడారని, ఇదేనా మీ విశ్వసనీయత అని ప్రశ్నించారు. పేపర్ లీకేజీ పై పూర్తీ స్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేసారు.
[subscribe]