తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క తెలంగాణ ప్రభుత్వం పై విమర్శలు గుప్పించారు. రాష్ట్ర అభివృధ్ధి కోసం టిఆర్ఎస్ చేసిందేమి లేదని, గతంలో కాంగ్రెస్ పార్టీ చేసిన పనులనే వారు చేసినట్లుగా చెప్పుకుంటున్నారని విమర్శించారు. ప్రభుత్వం ముందుగా ఉద్యోగాల భర్తీపై దృష్టి సారించాలని కోరారు. అధికారంలోకి వస్తే దళితులకు, గిరిజనులకు మూడెకరాల భూమి ఇస్తానని చెప్పి, తరువాత మాట తప్పి ప్రభుత్వం వారిని మోసం చేసిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలోనే అటవీ హక్కుల చట్టాన్ని తీసుకొచ్చి ఆదివాసీలకు వారు సాగు చేసుకుంటున్న భూములు కేటాయించామని భట్టి విక్రమార్క గుర్తు చేసారు.
అటవీ హక్కుల చట్టం ద్వారా వచ్చిన భూములను రాష్ట్ర అటవీ శాఖ అధికారులు గిరిజనుల నుండి గుంజుకుంటున్నారని, వారి భూములను బలవంతంగా స్వాదీనం చేసుకోకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. వారికీ కూడ రైతుబంధు, రుణమాఫీ, ఇతర సదుపాయాలను కూడ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ కార్మికుల గురించి ప్రభుత్వం పట్టించుకోవాలని కోరారు. ఆరేళ్లుగా పరిశ్రమల అభివృద్ధికి తెరాస ప్రభుత్వం ఏమి చేయలేదని అన్నారు. హైదరాబాద్ కు కాంగ్రెస్ మెట్రో రైలు తీసుకొస్తే తెరాస ప్రభుత్వం టికెట్ ధరలు పెంచిందని విమర్శించారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, చిత్రపురి కాలనీ సమస్యలు వంటి పలు అంశాలపై ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు.
[subscribe]