. ఒకప్పుడు రాజకీయాల్లో ఆయన పేరు ఓ సంచలనం. ఆంధ్రప్రదేశ్ లోని ఓ సామాజిక వర్గానికి పెద్ద దిక్కుగా పేరు. ఇంకో విశేషం ఏంటంటే.. తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు (అప్పుడు కాంగ్రెస్ ఐ నుంచి), ఆయన ఒకేసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన నేతలు. ఆయనే ముద్రగడ పద్మనాభం. కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్ల కోసం ఆయన చేసిన పోరాటం చరిత్రలో నిలిచిపోయింది. ఆయనకు కీర్తి తెచ్చిపెట్టింది. కానీ.. ఇప్పుడా కీర్తి మసకబారుతున్నట్లు కనిపిస్తోంది. రాజకీయంగా ఏపార్టీలో అడుగుపెట్టాలో తెలియకో, ఏ పార్టీ కూడా ఆయన కోరికలను నెరవేర్చడంలో లేదో తెలియదు కానీ.. ఏ నిర్ణయమూ తీసుకోలేకపోతున్నారు. ఓ దశలో రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించినా ఆ తర్వాత నిర్ణయం మార్చుకున్నట్లుగా తెరపైకివచ్చారు. అయితే ఎప్పుడు అసెంబ్లీ ఎన్నికలు వచ్చినా ముద్రగడ ప్రస్తావన రావడం.. ఆయన పోటీలో నిలబడకుండానే నిశ్శబ్దం పాటించడం సాధారణంగా మారింది.
వాస్తవానికి ముద్రగడ ప్రత్యక్ష రాజకీయాలకు కొన్నేళ్లుగా దూరంగా ఉంటున్నారు. కానీ గత ఎన్నికల్లో ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటినుంచీ ఆ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ వచ్చారు. కాపు రిజర్వేషన్ల దగ్గర నుంచి కాపు కార్పొరేషన్లను జగన్ ప్రభుత్వం నిర్వీర్యం చేసినా ఏరోజూ ఆయన నోరు విప్పలేదు. సరికదా.. ప్రశ్నించిన తెలుగుదేశం పార్టీని విమర్శలు చేస్తూ లేఖాస్త్రాలు విడుదల చేసేవారు. ఈ నేపథ్యంలో పూర్తి వైసీపీ నేతగా ముద్రగడ చలామణీ అవుతున్నారంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు సమీపించిన నేపథ్యంలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని ముద్రగడ కొంత ఆసక్తిగా ఉన్నారు. తనతోపాటు తనయుడిని కూడా ఎన్నికల బరిలోకి దించాలని ఉవ్విళ్లూరుతున్నారు. వైసీపీ సైతం ఆసక్తి చూపించింది. టీడీపీ, జనసేన ఎన్నికల పొత్తు కుదుర్చుకున్న నేపథ్యంలో ఆ ప్రభావం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అత్యంత బలంగా ఉన్నందున టీడీపీ కూటమి వైపు కాపు సామాజికవర్గ ఓట్లు మళ్లకుండా కొంతైనా చీలిక తెచ్చేందుకు జగన్ ప్రణాళిక సిద్ధం చేశారు. ఇందుకు ముద్రగడను పార్టీలో అధికారికంగా చేర్చుకుని ఎక్కడో చోట సీటు ఇవ్వాలని భావించారు.
జగన్ సన్నిహితుడైన కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి తరచూ ముద్రగడతో సంప్రదింపులు కూడా జరిపినట్లుగా వార్తలు వచ్చాయి. ఆయన తనయుడికి కాకినాడ ఎంపీ టికెట్ ఇప్పించేందుకు ప్రయత్నాలు చేశారు. ముద్రగడ సైతం జిల్లాలో పిఠాపురం, ప్రత్తిపాడు, జగ్గంపేట సీట్లలో ఎక్కడో చోట పోటీ చేయడానికి సానుకూలత చూపారు. ఈలోపు జగన్ అక్కడ సిటింగ్ ఎమ్మెల్యేలను తప్పించి కొత్త ఇన్చార్జులను ప్రకటించారు. దీంతో ముద్రగడ మనస్తాపం చెందారు. ఇటీవల తాడేపల్లి వెళ్లి అక్కడే రెండు రోజులు మకాం వేశారు. కానీ జగన్ అపాయింట్మెంట్ దొరకలేదని ఆయన సన్నిహితులు పేర్కొంటున్నారు. అటు పార్టీ జిల్లా పరిశీలకుడు మిథున్రెడ్డి నుంచి కూడా సరైన స్పందన రాకపోవడం, తన వద్దకు వీరెవరూ రాకపోవడంతో ముద్రగడ నొచ్చుకున్నట్లు సమాచారం. వైసీపీకి ఇంతకాలం పరోక్షంగా సహకరించినా.. ఇదేనా ఇచ్చే మర్యాద అని గుర్రుగా ఉన్నట్లు ఆయన వర్గంలో ప్రచారం జరుగుతోంది. ఈ అవమానం నేపథ్యంలో వైసీపీకి దూరంగా ఉండాలని ముద్రగడ నిర్ణయించారట.
ఈ పరిణామాలను అవకాశంగా మార్చుకున్న టీడీపీ జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడిలో ఉన్న ముద్రగడ స్వగృహానికి జనసేన నేతలను పంపించినట్లు వార్తలు వచ్చాయి. అదే సామాజిక వర్గానికి చెందిన జగ్గంపేట టీడీపీ ఇన్చార్జి జ్యోతుల నెహ్రూ.. ముద్రగడతో సమావేశమయ్యారు. బయటకు సాధారణ భేటీ అని నేతలు చెబుతున్నా టీడీపీ, జనసేనల్లో ఎందులో చేరాలనేదానిపై విడివిడిగా చర్చలు జరిపినట్లు సమాచారం. జనసేనలో చేరేందుకు ముద్రగడ దాదాపుగా నిర్ణయించారని ఆయన అనుచరులు చెబుతున్నారు. ఇదే విషయమై ముద్రగడ తనయుడు కొద్ది రోజుల క్రితం మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ.. టీడీపీ, జనసేనల్లో ఏదో ఒక పార్టీలో తాము చేరే అవకాశం ఉందన్నారు. వైసీపీలోకి వెళ్లడానికి తన తండ్రి ఆసక్తిగా లేరని చెప్పారు. ఈసారి కచ్చితంగా పోటీలో ఉంటామని, త్వరలోనే నిర్ణయం ఉంటుందన్నారు. అన్నింటికీ సిద్ధపడి గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నామని తెలిపారు. అయితే.. ఇప్పటికీ టీడీపీ, జనసేన, వైసీపీ ఏ పార్టీలో చేరేది ఇంకా స్పష్టత లేదు. ఈ క్రమంలో చాలా గ్యాప్ తర్వాత మళ్లీ రాజకీయంగా ఎంట్రీ ఇవ్వనున్న తరుణంలో ఏ పార్టీలో చేరాలో తెలియక సన్నిహితులతో తీవ్రస్థాయిలో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE