ఏపీ రాజకీయాలు ఇప్పుడు న్యాయం.. అన్యాయం చుట్టూ తిరుగుతున్నాయి. మాది న్యాయం అంటే.. కాదు.. మీది అన్యాయం అధికార, విపక్షనేతలు వాగ్వాదానికి దిగుతున్నారు. మాటలతో తూటాలు పేల్చుకుంటున్నారు. ఏపీ జైల్లో ఉన్నటీడీపీ అధినేత ఓ పక్క అనారోగ్యంతో బాధపడుతుంటే.. రాష్ట్రంలో అదో రాజకీయ అంశంగా మారింది. చంద్రబాబు కేవలం స్కిన్ అలర్జీతో బాధపడుతున్నట్లు ప్రభుత్వ వైద్యులు నివేదిక ఇస్తుంటే.. బాబు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని ఓ వర్గం ప్రచారం చేస్తోంది. ఆయన బరువుపై కూడా వాదోపవాదాలు కొనసాగుతున్నాయి. తాజాగా మరోసారి విడుదల చేసిన నివేదికపై కూడా రచ్చ జరుగుతోంది. జైలులో బాబుతో ములాఖత్ అయిన లోకేశ్ ఇదే విషయమై జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్ పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఆయనను చల్లటి వాతావరణంలో ఉంచాలని వైద్యుల నివేదిక స్పష్టం చేస్తున్నా.. ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని లోకేశ్ ప్రశ్నిస్తున్నారు. న్యాయానికి సంకెళ్లు.. అంటూ నిన్న తాజాగా ఏపీ టీడీపీ నిరసనలు చేపట్టింది.
రాజమండ్రి సెంట్రల్ జైల్లోమాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోగ్యంగానే ఉన్నారని ఆయన్ని పరీక్షించిన వైద్య బృందం ఇటీవల హెల్త్ బులెటిన్ ప్రకటించింది. చంద్రబాబు కేవలం చర్మ సంబంధిత సమస్య మాత్రమే ఉందని ఆయనను పరీక్షించిన డాక్టర్లు చెబుతున్నారు. చంద్రబాబు తమతో చాలా యాక్టివ్గా మాట్లాడారని వైద్యులు పేర్కొన్నారు. ”ఐదుగురు డాక్టర్లు చంద్రబాబును వివరాలు అడిగారు. చంద్రబాబును ఆసుపత్రికి పంపించాల్సిన అవసరం లేదు. చంద్రబాబు 67 కిలోల బరువున్నారు. చంద్రబాబుకు అన్ని రకాల పరీక్షలు చేశాం’ అని వైద్యులు వెల్లడించారు. మేం చెప్పిన మెడికేషన్ చంద్రబాబు వ్యక్తిగత డాక్టర్లతో సంప్రదించాకే వాడుతున్నారని ప్రభుత్వ డాక్టర్ శివకుమార్ తెలిపారు. ”చంద్రబాబుకు స్కిన్ అలర్జీ ఉంది. బాబు వ్యక్తిగత డాక్టర్లను సంప్రదించి ట్రీట్మెంట్ ఇచ్చాం. రిమాండ్కు రాకముందు బాబుకు ఎలాంటి వ్యాధులు ఉన్నాయో మాకు తెలియదు. చంద్రబాబు వేసుకుంటున్న మందులను మాకు చూపించారు. చంద్రబాబుకు ఎలాంటి స్టెరాయిడ్ ఇవ్వడం లేదు” అని డాక్టర్ శివకుమార్ పేర్కొన్నారు.
బాబు ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని లోకేశ్ తాజాగా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వైద్యులు చెప్పిన సదుపాయాలు కల్పించడం లేదని అంటున్నారు. దీనిపై జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్ స్పందిస్తూ.. ”చంద్రబాబు పట్ల ఎవరూ నిర్లక్ష్యంగా లేరు. 24 గంటలు చంద్రబాబుకు మా అధికారులు అందుబాబులో ఉంటున్నారు. అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకున్నాం. డెర్మటాలజిస్ట్ పరీక్షించి కొన్ని రికమండేషన్స్ చేశారు. నిబంధనల ప్రకారం మేం చేసే ఏర్పాట్లు మేం చేస్తాం. చంద్రబాబు విషయంలో మేం పూర్తి చర్యలు తీసుకుంటున్నాం. ప్రొటోకాల్ ప్రకారమే అందరితో నడుచుకుంటున్నాం. మేం ఎవరితోనైనా గౌరవంగానే వ్యవహరిస్తాం. చంద్రబాబు హైప్రొఫైల్ ప్రిజనర్. అత్యుత్తమ డాక్టర్ల బృందం అందుబాటులో ఉంది. చంద్రబాబు ఆరోగ్యం విషయంలో పూర్తి అప్రమత్తంగా ఉన్నాం” అని వివరణ ఇచ్చారు.
అయినప్పటికీ.. డీ హైడ్రేషన్.. స్కిన్ అలర్జీ.. బరువు తగ్గిపోయారంటూ వస్తున్న వార్తలు కుటుంబ సభ్యులతో పాటు టీడీపీ శ్రేణులను, బాబు అభిమానులను కలవరపెడుతున్నాయి. ఆయన బాగానే ఉన్నారని ప్రభుత్వ వైద్య బృందం చెబుతున్నప్పటికీ ఈరోజు బాబుతో ములాఖత్ అయిన సతీమణి భువనేశ్వరి, లోకేశ్ ఆయన చూసి వచ్చి ఆందోళన వెలిబుచ్చారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు హెల్త్ బులెటిన్ లో అంశాలు నిజమా? లేదా బాబు కుటుంబసభ్యుల ఆందోళన నిజమా.. అనేది అర్థం కావడం లేదు. ఇదిలా ఉంటే.. బాబును అన్యాయంగా జైలులో ఉంచి వేధిస్తున్నారని.. ఆయన కుటుంబ సభ్యులు, టీడీపీ శ్రేణులు ఆందోళన చేస్తుంటే.. అన్యాయానికి పాల్పడినందుకే అరదండాలు పడి శిక్ష అనుభవిస్తున్నారని వైసీపీ అంటోంది. ఇది ఇలా ఎన్నాళ్లు కొనసాగుతుందో.