ఆంధ్రప్రదేశ్ లో ఇతర పార్టీలలోంచి బీజేపీలోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా రాయలసీమకు చెందిన సీనియర్ రాజకీయ నేత బైరెడ్డి రాజశేఖర్రెడ్డి నవంబర్ 28, గురువారం నాడు బీజేపీ పార్టీలో చేరారు. ఢిల్లీలో బీజేపీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్మాధవ్, ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. బైరెడ్డి రాజశేఖర్రెడ్డితో పాటు ఆయన కుమార్తె శబరీ, బిగ్ బాస్ రియాలిటీ షో సీజన్ 2 విన్నర్ కౌశల్, అనగాని సులోచన తదితరులు కూడా బీజేపీలో చేరారు.
బైరెడ్డి రాజశేఖర్రెడ్డి 1994-2004 మధ్య నందికొట్కూర్ నియోజకవర్గంలో టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2004,2009 సాధారణ ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ తర్వాత 2012లో టీడీపీకి గుడ్ బై చెప్పి రాయలసీమ పరిరక్షణ సమితి పేరుతో పార్టీని ప్రారంభించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రత్యేక రాయలసీమ కోసం పోరాటం చేశారు. మళ్ళీ 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు, అక్కడ సరైన ప్రాధాన్యం లభించడం లేదని తిరిగి టీడీపీలో చేరి, ఆ పార్టీ అభ్యర్థుల తరపున ఎన్నికల్లో ప్రచారం కూడా చేశారు. ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం అనంతరం పార్టీకి దూరంగా ఉంటున్న ఆయన అనుచరులతో చర్చించి బీజేపీలో చేరారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని, రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని బైరెడ్డి వ్యాఖ్యానించారు.
[subscribe]