నవంబర్ 29, శుక్రవారం నుంచి హైటెక్సిటీ-రాయదుర్గం మెట్రోలైన్ అందుబాటులోకి వచ్చింది. రాష్ట్ర మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఈ రోజు ఉదయం హైటెక్సిటీ మెట్రో స్టేషన్లో జెండా ఊపి ఈ మార్గంలో మెట్రో రైలును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, రాష్ట్ర చీఫ్ సెక్రెటరీ ఎస్.కె.జోషీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్ మెంట్ స్పెషల్ సెక్రెటరీ అరవింద్ కుమార్, తదితరులు పాల్గొన్నారు. అనంతరం మెట్రో రైలులో హైటెక్ సిటీ నుంచి రాయదుర్గం వరకు ప్రయాణించారు. 1.5 కిలోమీటర్ల పొడవున్న ఈ మెట్రో కారిడార్లో మధ్యాహ్నం 2.30 గంటల నుంచి ప్రయాణికులను అనుమతించనున్నారు.
ఈ మార్గంలో మెట్రో సేవలు ప్రారంభం కావడంతో ఐటీ ఉద్యోగులకు వెసులుబాటు కలగనుంది. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో నగరంలో చేపట్టిన హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చి రెండేళ్ళు అవుతుంది. ప్రస్తుతానికి నాగోల్ నుంచి రాయదుర్గం వరకు, మియాపూర్ నుంచి ఎల్బీ నగర్ వరకు మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చాయి. మెట్రో రైలు ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 12.5 కోట్ల మంది ప్రయాణికులు మెట్రో సేవలను వినియోగించుకున్నారని హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్రెడ్డి తెలిపారు. ప్రస్తుతం రోజుకి 4 లక్షల మంది రాకపోకలు సాగిస్తున్నారని, ఈ రెండేళ్ల సమయంలో మెట్రో రైళ్లు 86 లక్షల కిలోమీటర్లు తిరిగియని ఆయన పేర్కొన్నారు.
[subscribe]