భారత్-శ్రీలంక జట్ల మధ్య జరిగిన మూడు టీ20ల సిరీస్ ను 2-0తో భారత్ కైవసం చేసుకుంది. జనవరి 10, శుక్రవారం నాడు పుణెలో శ్రీలంకతో జరిగిన మూడో టీ20లో భారత్ జట్టు 78 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలి టీ20 వర్షం కారణంగా రద్దవగా, రెండో టీ20లో భారత్ జట్టు 7 వికెట్ల తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్ లో బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని రంగాల్లో భారత్ ఆటగాళ్లు మంచి ప్రదర్శన చేసి శ్రీలంకపై పూర్తి స్థాయిలో ఆధిపత్యాన్ని చూపించారు. మూడో టీ20లో టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 201 పరుగులు భారీ స్కోర్ చేసింది. ఓపెనర్లు శిఖర్ ధావన్(52), కేఎల్ రాహుల్ (54) అర్ధ శతకాలతో రాణించి మొదటి వికెట్ కు 97 పరుగులు జోడించారు. వీరి తర్వాత క్రీజులోకి వచ్చిన సంజు శాంసన్(6), శ్రేయస్ అయ్యర్ (4) పరుగులతో వెంటనే పెవిలియన్ బాట పట్టారు. అనంతరం కెప్టెన్ విరాట్ కోహ్లీ(26), మనీశ్ పాండే (31), శార్దూల్ ఠాకుర్(22) పరుగులు చేయడంతో భారత్ శ్రీలంక జట్టుకు 201 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. శ్రీలంక బౌలర్లలో సందకన్ మూడు వికెట్లు తీయగా, హాసరంగ, లాహిరు కుమారా చెరో వికెట్ పడగొట్టారు.
అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో శ్రీలంక జట్టు 15.5 ఓవర్లకే 123 పరుగుల చేసి ఆలౌటైంది. భారత బౌలర్లు అద్భుతమైన బౌలింగ్ తో శ్రీలంక ఆటగాళ్లు వరుసగా పెవిలియన్ బాట పట్టారు. శ్రీలంక జట్టులో ధనంజయ డిసిల్వ(57), ఏంజెలో మాథ్యూస్(31) మాత్రమే కొద్దిగా ప్రయత్నం చేశారు. మిగతా బ్యాట్స్మెన్ అంతా సింగిల్ డిజిట్ పరుగులకే పరిమితమయ్యి ఘోరంగా విఫలమయ్యారు. భారత్ బౌలర్లలో నవ్దీప్ సైని మూడు వికెట్లు తీయగా, శార్దూల్ ఠాకుర్, వాషింగ్టన్ సుందర్ చెరో రెండు వికెట్లు, బుమ్రా ఒక్క వికెట్ పడగొట్టారు. మూడో టీ20లో విజయంతో సిరీస్ ను గెలుచుకున్న భారత్ జట్టు ఈ ఏడాదిని ఘనంగా ప్రారంభించింది.