ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో నిర్వహించే డిపార్ట్ మెంట్ పరీక్షల్లో నెగటివ్ మార్కుల విధానం ఎత్తివేయాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ఫైలుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం నాడు సంతకం చేశారు. ఈ అంశంపై ఒకట్రెండు రోజుల్లో ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఉద్యోగులు త్వరగా పదోన్నతులు పొందనున్నారు. అలాగే ముఖ్యంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో విధులు నిర్వర్తిస్తున్న లక్షకు పైగా ఉన్న ఉద్యో గులు త్వరితగతిన రెగ్యులర్ అయ్యే అవకాశం ఉంది.
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 2016 నుంచి డిపార్ట్ మెంట్ పరీక్షల్లో నెగటివ్ మార్కుల విధానాన్ని అమలులోకి తెచ్చారు. ఈ విధానంతో ఉద్యోగులు సకాలంలో పరీక్ష పాస్ కాలేక పోతున్నారు. డిపార్ట్ మెంట్ పరీక్షలు రాస్తున్న వారిలో పది శాతం కూడా పాస్ కావడం లేదని, దీంతో ఉద్యోగులు సకాలంలో ఇంక్రిమెంట్లు, పదోన్నతులు పొందలేకపోతున్నారని ఏపీ గవర్న మెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. వారికిచ్చిన హామీలో భాగంగా నెగటివ్ మార్కుల విధానాన్ని ఎత్తివేస్తూ సీఎం వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu