టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర పెనుకొండ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో కొనసాగుతోంది. మంగళవారం 53వ రోజు యువగళం పాదయాత్ర గుమ్మయ్యగారిపల్లి క్యాంప్ సైట్ నుంచి ప్రారంభమైంది. ఈ క్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలు నారా లోకేష్ వెంట పాదయాత్రలో పాల్గొంటున్నారు. కాగా అంతకుముందు సోమవారం గోరంట్లలో టీడీపీ శ్రేణులు లోకేష్ కు ఘనస్వాగతం పలికి భారీ గజమాలతో సత్కరించారు. అలాగే పాదయాత్రలో పలువురు ప్రముఖులు పాల్గొని లోకేష్ కు సంఘీభావం తెలిపారు. మాజీమంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, అమర్ నాథ్ రెడ్డి, కాల్వ శ్రీనివాసులు, ఎమ్మిగనూరు మాజీ ఎమ్మెల్యే జయనాగేశ్వర్ రెడ్డి, ఇటీవల పార్టీలో చేరిన నెల్లూరు జిల్లా నాయకుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తదితరులు సంఘీభావంగా కొంతసేపు పాదయాత్రలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గుమ్మయ్యగారిపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో నారా లోకేష్ మాట్లాడుతూ.. యువగళం పాదయాత్రను అడ్డుకోవద్దని చెప్పినా వినకుండా రకరకాలుగా ఇబ్బందులకు గురిచేశారని, అది ఇప్పుడు దండయాత్రగా మారిందని పేర్కొన్నారు. ఇక మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ఇచ్చిన షాక్ దెబ్బకి సీఎం జగన్కు 104 డిగ్రీల జ్వరం పట్టుకుందని, త్వరలో వైసిపి దుకాణం బంద్ అవ్వడం ఖాయమని అన్నారు. ఏపీలో జగన్ పరిపాలనపై తాము విమర్శించడం కాదని, వారి సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేలే తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలిపారు. వైసీపీలో 50 మంది ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారని ఆ పార్టీ నేతలే ప్రకటిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో వైసీపీని రాష్ట్ర ప్రజలు డిస్మిస్ చేస్తారని అంటున్నారని గుర్తుచేశారు. జగనన్న ఇళ్ల పథకం పెద్ద స్కాం అని ఆ పార్టీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి వ్యాఖ్యానించారని.. దీనిపై సీఎం జగన్ కానీ, సజ్జల రామకృష్ణారెడ్డి కానీ స్పందించాలని కోరారు. అలాగే వైసీపీలో ఎమ్మెల్యేలకు కనీస గౌరవం లేదని ఎంతోమంది మథనపడుతున్నారని, త్వరలోనే వారందరూ జగన్ను వీడుతారని తెలిపారు. ప్రజల్లో మార్పు కనిపిస్తోందని, అభివృద్ధి లేక వెనుకబడిన రాష్ట్రాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాత్రమే గాడిలో పెట్టగలరని నమ్ముతున్నారని నారా లోకేష్ అన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE