ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ‘యువగళం’ ఆగదని.. అలాగే జనసేన ‘వారాహి’ కూడా ఆగదని ప్రకటించారు యువనేత నారా లోకేష్. శుక్రవారం కుప్పంలో లోకేష్ నేతృత్వంలో ‘యువగళం’ పాదయాత్ర ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దీనిలో పాల్గొన్న లోకేష్ సభలో ప్రసంగిస్తూ వైసీపీ ప్రభుత్వంపై పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను పాదయాత్ర ఆరంభించడానికి గల కారణాలు, రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ త్వరలో చేపట్టనున్న వారాహి బస్సు యాత్రకు సంబంధించి ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక ఈ బహిరంగ సభకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు.
నారా లోకేష్ ప్రసంగంలోని కొన్ని కీలక అంశాలు..
- నాడు రామన్న ‘చైతన్య రథం’, ఆ తర్వాత చంద్రన్న ‘వస్తున్నా మీ కోసం’ యాత్రలు చేపట్టి ప్రజల కష్టాలు స్వయంగా తెలుసుకున్నారు.
- వారి స్ఫూర్తితోనే రాష్ట్రంలోని యువత భవిష్యత్తు కోసం ఇప్పుడు నేను యువగళం పాదయాత్రను ప్రారంభించాను.
- అయితే నేను యువగళం యాత్రను ప్రకటించగానే వైసీపీ నాయకులకు వణుకు మొదలైంది.
- నాపై 10 మంది మంత్రులు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఏ అర్హతతో పాదయాత్ర చేస్తున్నావని ప్రశ్నించారు.
- వారందరికీ ఒకటే చెబుతున్నా.. నాటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో పంచాయితీరాజ్ శాఖ మంత్రిగా, ఐటీ శాఖ మంత్రిగా పనిచేశాను.
- ఆ సమయంలో దేశంలోనే అత్యుత్తమంగా ఎన్నో అభివృద్ధి కార్యకమాలు చేపట్టి 25 వేల కిలోమీటర్ల రోడ్లు వేయించాను, యువతకు 40 వేల ఉద్యోగాలు వచ్చేలా చేశాను.
- ఆ అర్హతతోనే నేడు రాష్ట్రంలో యువత ఉద్యోగాలు లేక అవస్థలు పడుతుంటే చూడలేక ‘యువగళం’ పాదయాత్ర చేపట్టాను.
- నాకు చీర, గాజులు పంపిస్తామని ఒక మహిళా మంత్రి వ్యాఖ్యానించారు. సరే, పంపించండి.. వాటిని పార్టీలోని మా అక్కా చెల్లెమ్మలకు అందిస్తా.
- నన్ను విమర్శిస్తున్న ప్రతి ఒక్క మంత్రిని, నాయకుడిని ప్రశ్నిస్తున్నా.. ఈ మూడేళ్ళలో మీరు ఏం చేశారు?
- ప్రతియేటా జాబ్ కాలెండర్ ప్రకటిస్తానని నాడు ఎన్నికల సమయంలో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు.
- కానీ ఇప్పటివరకూ ఒక్క ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించలేదు, మెగా డీఎస్సీ వేస్తామన్న వారు ఎందుకు వేయలేదు?
- రాష్ట్రంలోని యువత ఉపాధి అవకాశాలు లేక పక్కరాష్ట్రాలకు తరలిపోతున్నారు.
- యువతకు హామీ ఇస్తున్నా.. త్వరలోనే వారికోసం ప్రత్యేకంగా మేనిఫెస్టో ప్రకటిస్తాం.
- అందులో ప్రభుత్వ ఉద్యోగాలెన్ని? ప్రైవేట్ ఉద్యోగాలెన్ని?స్వయం ఉపాధి ద్వారా ఎన్ని ఉద్యోగాలు కల్పిస్తాం వంటి వివరాలు స్పష్టంగా తెలియజేస్తాం.
- నాడు ఢిల్లీ మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామన్నారు, ఆ విషయం ఏమైంది?
- మూడు రాజధానులంటూ చివరికి రాష్ట్రానికి ఒక్క రాజధాని కూడా లేకుండా చేశారు.
- జనసేనాని పవన్ కళ్యాణ్ పర్యటనలను అడ్డుకుంటున్నారు. ఆయన వాహనం వారహిని రోడ్లపై తిరగనివ్వమని బెదిరిస్తున్నారు.
- నేను ఇప్పుడు చెబుతున్నా.. టీడీపీ ‘యువగళం’ ఆగదు.. జనసేన ‘వారాహి’ ఆగదు, మా యాత్రలను జీవో 1 అడ్డుకోలేదు.
- ఎన్ని ఆంక్షలు పెట్టినా పాదయాత్ర కొనసాగిస్తా.. భయం నా బయోడేటాలోనే లేదు.
- టీడీపీ పాలన అంటే.. సంక్షేమం, అభివృద్ధి గుర్తొస్తాయి. మళ్ళీ టీడీపీని అధికారంలోకి తేవడానికి యువత సహకరించాలి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE