ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో కర్ఫ్యూ విధించిన సంగతి తెలిసిందే. ప్రతిరోజూ మధ్యాహ్నం 12 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అత్యవసర ప్రయాణికుల కోసం సోమవారం నుంచి ఈ-పాస్ విధానాన్ని అందుబాటులోకి తెస్తున్నట్టు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. అలాగే అంతర్రాష్ట్ర రాకపోకలపై రాష్ట్ర ప్రభుత్వం తదుపరి నిర్ణయం తీసుకొనేంత వరకు ఆంక్షలు కొనసాగుతాయని చెప్పారు.
ప్రజలంతా కరోనా నిబంధనలు పాటించాలని సూచించారు. అత్యవసర పరిస్థితులలోనే బయటకు రావాలని కోరారు. ఉదయం 6 నుంచి 12 గంటల వరకు బహిరంగ ప్రదేశాల్లో డబుల్ మాస్క్ పెట్టుకోవడం, భౌతిక దూరం పాటించాలని కోరారు. ఎవరైనా కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామని, వాహనాలు జప్తు చేస్తామని డీజీపీ గౌతమ్ సవాంగ్ హెచ్చరించారు. రాష్ట్రంలో 144 సెక్షన్ అమల్లో ఉండడంతో సమావేశాలకు అనుమతి లేదని, ప్రజల ఎక్కడ గుమికూడకుండా ఉండాలని సూచించారు. డయల్ 100, 112కి ఫోన్ చేసి తమ దృష్టికి వచ్చిన నిబంధనల అతిక్రమణపై ఫిర్యాదు చేయాలని చెప్పారు.
కర్ఫ్యూ సమయంలో ప్రయాణాల కోసం తగిన ఆధారాలతో కూడిన డాక్యుమెంట్స్ అందించి, ఎస్పీలు, పోలీస్ కమిషనర్ల నుంచి అనుమతి తీసుకోవాలని తెలిపారు. అత్యవసర ప్రయాణాల కోసం గత సంవత్సరం అమలు చేసిన ఈ-పాస్ విధానం మళ్ళీ ప్రారంభిస్తున్నామని అన్నారు. ఇక హోమ్ ఐసొలేషన్స్ లో ఉన్న కరోనా బాధితులు 104, 1092 హెల్ప్ లైన్ నంబర్లకు ఫోన్ చేసి డాక్టర్లను సంప్రదించి టెలీ కన్సల్టేషన్ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. అలాగే ఈ సమయంలో పౌరులు పోలీస్ స్టేషన్కు వెళ్లకుండానే నేరుగా ఏపీ పోలీస్ సేవ అప్లికేషన్ ద్వారా తమ సమస్యను ఫిర్యాదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. నిర్ధారణ చేసుకోకుండా అవాస్తవాలను, పుకార్లను ప్రచారం చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ