ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్దీ ..రాష్ట్రంలో ప్రధాన నియోజకవర్గాలపైనే అందరి చూపూ పడుతోంది. ముఖ్యంగా తిరుపతి లోక్ సభ సెగ్మెంట్ పరిధిలోకి వచ్చే అసెంబ్లీ నియోజకవర్గాల్లో.. జనరల్ సీటు అయిన తిరుపతి గురించే నేతలతో పాటు ఏపీ ప్రజలు మాట్లాడుకుంటున్నారు. తిరుపతి అర్బన్, రూరల్ మండలాలతో కలిసి తిరుపతి నియోజకవర్గం ఏర్పడింది. ఇక్కడ 2.7 లక్షలకు పైనే ఓటర్లు ఉన్నారు. స్వర్గీయ ఎన్టీఆర్, చిరంజీవి వంటి సినీ ప్రముఖులు ఈ అసెంబ్లీ నుంచే పోటీ చేసి గెలిచారు. అయితే జనాభా పరంగా బలిజలు ఎక్కువ మంది ఉన్నా కూడా.. కమ్మ, రెడ్డి సామాజిక వర్గాల మధ్యలోనే ఎక్కువగా పోరు నడిచే నియోజకవర్గంగా దీని గురించి చెప్పుకుంటారు.
తెలుగు దేశం పార్టీ ఆవిర్భావానికి ముందు తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్లో ..మొత్తం ఆరుసార్లు ఎన్నికలు జరిగాయి. 1967లో జరిగిన ఎన్నికలలో ఇండిపెండెంట్ అభ్యర్ధి ఈశ్వర్ రెడ్డి గెలిస్తే.. మిగిలిన ఐదుసార్లు కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపును తన ఖాతాలో వేసేసుకుంటూ వచ్చింది. ఇక్కడి నుంచి గెలిచిన ఈశ్వర్ రెడ్డి 1978లో అసెంబ్లీ స్పీకర్ గానూ పనిచేశారు. తెలుగు దేశం పార్టీ ఆవిర్భావం తర్వాత రెండు ఉపఎన్నికలతో పాటు..ఇక్కడ మొత్తం పదకొండు సార్లు ఎన్నికలు జరిగాయి. ఇందులో ఒక ఉపఎన్నిక సహా ఐదుసార్లు అంటే 1983 , 1994 , 1999 , 2014 లో జరిగిన ఎన్నికలతో పాటు 2015లో జరిగిన ఉప ఎన్నికలో టీడీపీనే గెలిచింది. 1983 ఎన్నికల్లో ఎన్టీఆర్ తిరుపతిలో గెలిచి తొలి కాంగ్రెసేతర ముఖ్యమంత్రిగా..ఆయన రికార్డుల కెక్కారు.
తిరుపతి అసెంబ్లీ సీటులో మూడుసార్లు అంటే 1985, 1989, 2004లలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. 2009లో ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి.. తొలిసారి ఇక్కడి నుంచే పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయాన్ని సాధించారు. అయితే చిరంజీవి రాజ్యసభ ఎంపీగా వెళ్లడంతో ..2012లో వచ్చిన ఉపఎన్నికల్లో వైఎస్సార్సీపీ తొలిసారి విజయం సాధించింది. 2014లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా గెలిచిన వెంకటరమణ ఆకస్మిక మరణంతో జరిగిన ఉపఎన్నికల్లో.. వెంకటరమణ భార్య సుగుణమ్మ గెలిచారు. ఆ తర్వాత 2019 ఎన్నిక్లలో మాత్రం వైఎస్సార్సీపీ అభ్యర్ధి భూమన కరుణాకర్ రెడ్డి విజయాన్ని సాధించారు.
మరోవైపు కులాలవారీగా కనుక చూస్తే ఎనిమిదిసార్లు రెడ్లు , ఏడు సార్లు బలిజలు , ఒకసారి కమ్మ అభ్యర్ధి.. తిరుపతి అసెంబ్లీ సీటు నుంచే గెలిచారు. అయితే 1983లో గెలిచిన ఎన్టీఆర్ ని కమ్మ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిగా , 2009లో గెలిచిన చిరంజీవిని కాపు సామాజిక వర్గానికి చెందిన అభ్యర్ధిగా కంటే.. అప్పట్లో వారికున్న క్రేజ్ వల్ల విజయం సాధించారు. అయితే తాజాగా మారిన రాజకీయ పరిణామాలతో 2024 ఎన్నికల్లో తిరుపతి నియోజకవర్గం టీడీపీకి గెలుపు అవకాశం ఉన్న నియోజకవర్గంగా కనిపిస్తోంది. టీడీపీ,జనసేన కూటమికి ఇటు కమ్మ, అటు బలిజ ఓట్లు పడే అవకాశం ఉండటంతో 2024 ఎన్నికలు ఈ కూటమికి కలిసి వస్తాయనే అంచనాలు అంతటా పెరుగుతున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY