రాజ్యసభ ఎంపీ, బీజేపీ నేత టీజీ వెంకటేష్ రాయలసీమ హక్కుల ఐక్యవేదిక సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ కన్నా రాయలసీమ ప్రాంతం పూర్తిగా వెనుకబడి ఉందని అన్నారు. సమైక్యాంధ్ర ఉన్నప్పుడు రాయలసీమ హక్కుల ఐక్యవేదిక తరఫున 12 సంవత్సరాలపాటు పోరాటం జరిగిందని, అందులో స్పెషల్ స్టేటస్, రెండో రాజధాని, హైకోర్టు బెంచ్, యూనివర్సిటీలు, ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం పోరాటం చేశామని, ఈ ప్రాంతం అభివృద్ధి సాధించేవరకు పోరాటాన్ని కొనసాగిస్తూ ముందుకు సాగుతామని చెప్పారు. రాయలసీమ బాగుపడాలంటే స్పెషల్ ప్యాకేజి తప్పనిసరి అని ఆయన చెప్పారు.
తెలంగాణ ఉద్యమ తరహాలో, ఎవరికీ ఇబ్బంది కలగకుండా శాంతియుత పద్ధతిలో యువత పోరాడి సాధించుకోవాలని పిలుపు నిచ్చారు. రాష్ట్రంలో ఉన్న నాలుగు ప్రాంతాల్లో రాజధాని తరహా అభివృద్ధి జరగాలని ఆయన డిమాండ్ చేసారు. కళ్ళ ముందు నీరు ఉన్నా కూడ త్రాగలేని పరిస్థితుల్లో సీమ ప్రాంతం ఉందని, శ్రీశైలం ప్రాజెక్టు ఒక స్టోరేజ్ ట్యాంకులా మారి మిగిలిన ప్రాంతాలకు ఉపయోగపడుతుందని అన్నారు. ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ ప్రజలకిచ్చిన అజెండాలో పనులు పూర్తి చేసుకుని, రాయలసీమ ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉండాలని, ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కోరారు. ఈ ప్రాంతంలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసే విధంగా ముందుకు పోవాలని కోరారు. బీజేపీ రాయలసీమ అభివృద్ధికి డిక్లరేషన్ ఇచ్చిందని, సీమ ప్రాంత అభివృద్ధికి శాంతియుతంగా పోరాడేవారికి ఎప్పుడూ మద్ధతుగా ఉంటామని టీజీ వెంకటేష్ పేర్కొన్నారు.
[subscribe]
[youtube_video videoid=8ZkVPyLBaOo]