సుదీర్ఘకాలం పాటు గవర్నర్ గా సేవలందించిన ఈఎస్ఎల్ నరసింహన్ కు తెలంగాణ ప్రభుత్వం ఘనంగా వీడ్కోలు పలికింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ లో వీడ్కోలు సమావేశాన్ని ఏర్పాటు చేసారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు గవర్నర్ దంపతులకు పూలమాల, శాలువాతో సత్కరించి వీణను బహూకరించి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కేసీఆర్ గవర్నర్ సేవలను గుర్తు చేసుకున్నారు. గవర్నర్ నరసింహన్ మాట్లాడుతూ, కేసీఆర్ తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. మొదట్లో కేసీఆర్ ఆయన్ను కలవడానికి 12 గంటలకు వచ్చే వారని, ఆ సమావేశం దాదాపుగా మూడుగంటలపైనే కొనసాగేదని చెప్పారు. ఆ తరువాత ఎప్పుడైనా కేసీఆర్ తో సమావేశం ఉందంటే 10 గంటలకే భోజనం ముగించుకుని సమావేశానికి సిద్ధమయ్యేవాడినని చెప్పారు. తమ మధ్య అనేక అంశాలు చర్చకు వచ్చేవని చెప్పారు. ఈ కార్యక్రమానికి శాసనసభాపతి, ఉప సభాపతి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు, సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు హాజరయ్యారు.
అనంతరం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ దంపతులు చెన్నై బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వాధికారులు వారికీ వీడ్కోలు పలికారు. ఆయనకు పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. ప్రభుత్వం తరుపున నరసింహన్ వెంట ఆర్ అండ్ బీ ముఖ్య కార్యదర్శి మరియు ఏడీసీని పంపించారు. ఇక ఆదివారం ఉదయం 11 గంటలకు తెలంగాణ రాష్ట్ర కొత్త గవర్నర్ గా తమిళిసై సౌందరరాజన్ ప్రమాణస్వీకారం చేయనున్నారు.
[subscribe]
[youtube_video videoid=VRQbd8v_zbY]