తెలంగాణ రాష్ట్ర గవర్నర్గా డా. తమిళిసై సౌందరరాజన్ రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారం చేశారు. ఆదివారం ఉదయం 11 గంటలకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాఘవేంద్ర సింగ్ చౌహన్ ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకార అనంతరం ఆమె తండ్రి ఆనందన్ కు పాదాభివందనం చేసారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు హాజరయ్యారు, సీఎం కేసీఆర్ మరియు జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహన్ గవర్నర్కు పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా నియమితులైన బండారు దత్తాత్రేయ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మండలి డిప్యూటీ ఛైర్మన్ నేతి విద్యా సాగర్, తమిళనాడు రాష్ట్ర డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం, తమిళనాడు మంత్రులు వేలుమణి, తంగమణి, తెలంగాణ రాష్ట్ర మంత్రులు, డీజీపీ మహేందర్ రెడ్డి, నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అనంతరం గవర్నర్ అతిధులకు రాజభవన్ దర్బార్ హాల్లో తేనీటి విందు ఇచ్చారు.
ముందుగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా నియామకమైన డా. తమిళిసై సౌందరరాజన్ ఆదివారం ఉదయం హైదరాబాద్ చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయంలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు, మేయర్ బొంతు రామ్మోహన్, రాష్ట్ర మంత్రులు, ప్రముఖులు తమిళిసైకి, ఆమె కుటుంబ సభ్యులకు ఘనంగా స్వాగతం పలికారు. బేగంపేట ఎయిర్ పోర్టులోనే పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన తర్వాత ఆమె రాజ్ భవన్ వెళ్లారు.
[subscribe]
[youtube_video videoid=pC0ekQRsnzc]