వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి 194వ జయంతి వేడుకలు జనసేన పార్టీ హైదరాబాద్ కేంద్ర కార్యాలయంలో శనివారం ఉదయం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పాల్గొని, ఝాన్సీ లక్ష్మీబాయ్ చిత్ర పటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ వీరమహిళలను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “సామ్రాజ్య రక్షణ కోసం ఝాన్సీ లక్ష్మీబాయి చేసిన పోరాటం ఎందరికో స్ఫూర్తి. మాతృభూమి కోసం బిడ్డను వీపు మీద కట్టుకొని గుర్రపు స్వారీ చేస్తూ యుద్ధం చేయడం నాలో స్ఫూర్తి రగిలించింది. పరాయి పాలకుల అణచివేతపై తిరుగుబాటు జరిపి ప్రాణాలర్పించిన ధీరవనిత ఆమె” అని పేర్కొన్నారు.
ఎంతటి రాక్షసుడినైనా శక్తి స్వరూపిణి అంతం చేయగలదని, అందుకే జనసేన మహిళా విభాగానికి వీర మహిళ విభాగమని నామకరణం చేశామని పవన్ కళ్యాణ్ చెప్పారు. వీర మహిళలే జనసేన పార్టీకీ అండదండ అన్నారు. “రాజకీయ నాయకులు అంటే గొంతేసుకొని పడిపోవడం, నోటికొచ్చినట్లు తిట్టడం కాదు. చదువుకున్న వాళ్లు, పాలనాపరమైన, విధానపరమైన పాలసీలపై అవగాహన కలిగిన వాళ్లు.. పోరాటం చేయగల సత్తా ఉన్న మహిళలు రాజకీయాల్లోకి రావాలి. అలాంటి వాళ్లు సగటు కుటుంబాల నుంచే వస్తారు. రాజకీయాల్లో బాధ్యత కలిగిన మహిళా నాయకులు ఉండాలని కోరుకుంటాను. అప్పట్లో రమిజాబీ రేప్ కేసు ఎంతో సంచలనం సృష్టించింది. మేము స్కూల్ కు వెళ్తుంటే దారిలో గోడలపై రమిజాబీకి న్యాయం చేయాలని రాసుండేవి. రమిజాబీకి న్యాయం జరగాలని అందరూ ముక్త కంఠంతో కోరారు. ఇప్పుడు రాజకీయ నాయకులు బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారు. ఒకట్రెండు మానభంగాలు జరిగినా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అన్నట్లు మాట్లాడుతున్నారు. ఆ మైండ్ సెట్ ను మనం మార్చాలి. సుగాలీ ప్రీతిపై అఘాయిత్యం చేసి హత్య చేశారు. దివ్యాంగురాలైన ఆమె తల్లి న్యాయం కోసం ప్రజాప్రతినిధులు, అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉంది. అయినా సమాజంలో చలనం లేకుండా పోయింది. ఆడబిడ్డల సంరక్షణ చాలా ముఖ్యమైనది” అని పవన్ కళ్యాణ్ అన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE