జూలై 21 నాడు ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో 3వ సీజన్ రోజు రోజుకు ఆసక్తికరంగా మారుతూ సరికొత్త మలుపులతో అలరిస్తుంది. అక్టోబర్ 6, ఆదివారం నాడు జరిగిన 78వ ఎపిసోడ్ లో నటి పునర్నవి భూపాలం ఈ షో నుంచి ఎలిమినేట్ అయ్యారు. ఎలిమినేషన్ ప్రాసెస్ లో ఈ వారం వరుణ్ సందేశ్, పునర్నవి, రాహుల్, మహేష్ విట్టా ఉండగా శనివారం ఎపిసోడ్ లోనే రాహుల్ సేఫ్ జోన్ లో ఉన్నట్టుగా వ్యాఖ్యాత నాగార్జున ప్రకటించారు. ఇక మిగిలిన ముగ్గురిలో ముందుగా వరుణ్ సందేశ్ ను సేవ్ చేసి, మహేష్ విట్టా-పునర్నవిలలో ప్రేక్షకుల నుంచి తక్కువ ఓట్లు పొందిన పునర్నవి ఎలిమినేట్ అయినట్టు ఆదివారం నాడు నాగార్జున ప్రకటించారు. అదేవిధంగా మహేష్ విట్టా తృటిలో ఎలిమినేషన్ నుంచి తప్పించుకున్నాడని చెప్పారు.
పునర్నవి ఎలిమినేట్ అవ్వడంతో ఇన్ని రోజులు ఇంటిలో తనతో క్లోజ్ గా ఉన్న రాహుల్ వెక్కి వెక్కి ఏడ్చేశాడు. మిగిలిన ఇంటి సభ్యుల ఎంత ఓదార్చినా కూడ కంట్రోల్ చేసుకోలేకపోయాడు. ఒకరిని మాస్టర్ గా, మరొకరిని సేవకుడిగా ఎన్నుకుంటు ఇంటి సభ్యులపై బిగ్ బాంబ్ వేయాలంటూ నాగార్జున కోరగా, అలీరేజాను మాస్టర్ గా, బాబా భాస్కర్ ను సేవకుడిగా పునర్నవి ఎంపిక చేసింది. ఆదివారం ఎపిసోడ్లో హోస్ట్ నాగార్జున ఇంటి సభ్యులతో నవరసాల ప్రదర్శన చేయించి ప్రేక్షకులను అలరించారు. 100 రోజుల పాటు ఆసక్తికరంగా సాగే ఈ షో లో ఇప్పటికి 78 రోజులు పూర్తయ్యాయి. నటి హేమ, జర్నలిస్టు జాఫర్, వైల్డ్ కార్డు ఎంట్రీ తమన్నా సింహాద్రి, రోహిణి, అషురెడ్డి, శిల్ఫా చక్రవర్తి, హిమజ , రవికృష్ణ, పునర్నవి ఎలిమినేట్ అవ్వడంతో ఇంటిలో ఇంకా 8 మంది సభ్యులున్నారు.