హుజూర్నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో అక్టోబర్ 21న ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న చావా కిరణ్మయికి మద్దతుగా ప్రముఖు సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రచారం చేయబోతున్నట్లు సమాచారం. ఈనెల 13నుంచి 18లోపు షెడ్యూల్ వివరాలు ఖరారు అయ్యాక అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. హుజూర్నగర్ ఉపఎన్నికపై టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అక్టోబర్ 5 శనివారం నాడు తెలంగాణ ముఖ్య నేతలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రచార వ్యవహారాలు, బాలకృష్ణ పర్యటన ఇతర అంశాలపై చర్చించినట్టు సమాచారం. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, రావుల చంద్రశేఖర్రెడ్డి, అరవిందకుమార్గౌడ్ లు ఉపఎన్నికల పరిస్థితులను చంద్రబాబు నాయుడుకు వివరించారు. గత అసెంబ్లీ ఎన్నికలలో ఫలితాలు నిరాశ కలిగించడంతో ఈ ఉప ఎన్నికల్లో సత్తా చాటి తెలంగాణలో పార్టీ ఉనికిని చాటాలని టీడీపీ నేతలు భావిస్తున్నారు.
కీలక పార్టీలైన టిఆర్ఎస్, కాంగ్రెస్ ఇప్పటికే ప్రచారాన్ని మొదలు పెట్టాయి. ఈ ఉప ఎన్నికలను అటు కాంగ్రెస్, ఇటు తెరాస పార్టీలు ప్రతిష్టాత్మకంగా భావించడంతో ఒక్కసారిగా హుజూర్నగర్ లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. మరో వైపు టీడీపీ, బీజేపీ అభ్యర్థులు వారి పార్టీ కీలక నాయకుల్ని ప్రచారంలోకి దించి విజయావకాశాలను మెరుగుపర్చుకోవాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ అభ్యర్దికి మద్దతుగా హీరో నందమూరి బాలకృష్ణను రంగంలోకి దించటం ద్వారా పార్టీ కార్యకర్తలలో కొత్త జోష్ వస్తుందని పార్టీ అధినేత చంద్రబాబు భావిస్తున్నారు. బాలకృష్ణతో రోడ్షోలు, బహిరంగ సభలు నిర్వహించే అవకాశం ఉంది.
[subscribe]