ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తి(సీజే)గా నియమితులైన జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసారు. అక్టోబర్ 7, సోమవారం ఉదయం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, జితేంద్ర కుమార్ మహేశ్వరి కుటుంబసభ్యులు, ప్రస్తుతం హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఉంటున్న జస్టిస్ చాగరి ప్రవీణ్కుమార్, రాష్ట్ర ఉన్నతాధికారులు, హైకోర్టుకు చెందిన న్యాయమూర్తులు, పలువురు న్యాయవాదులు హాజరయ్యారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన తేనేటి విందులో సీజే జేకే మహేశ్వరి,సీఎం వైఎస్ జగన్, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తదితరులు పాల్గొన్నారు.
ముందుగా అక్టోబర్ 6, ఆదివారం రాత్రి గన్నవరం విమాశ్రయానికి చేరుకున్న జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి కు కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్, విజయవాడ పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమల రావు తదితరులు ఘనంగా స్వాగతం పలికారు. 1961 జూన్ 21న జన్మించిన జస్టిస్ జేకే మహేశ్వరి, 1985 నవంబర్ 22న న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. తదనంతరం మధ్యప్రదేశ్ హైకోర్టులో ప్రాక్టీస్ మొదలుపెట్టి సివిల్, క్రిమినల్, ఇతర రాజ్యాంగపరమైన వ్యవహారాల్లో న్యాయవాదిగా పనిచేసారు. 2005 నవంబర్ 25న మధ్యప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులై, 2008లో శాశ్వత న్యాయమూర్తి అయ్యారు.
[subscribe]