తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో కోవిడ్-19 (కరోనా వైరస్) రోజురోజుకి క్రమంగా విజృంభిస్తుంది. ఏప్రిల్ 2, గురువారం నాటికీ తెలంగాణ రాష్ట్రంలో 154 కరోనా పాజిటివ్ కేసుల నమోదవ్వగా, ఆంధ్రప్రదేశ్ లో కరోనా సోకిన వారి సంఖ్య 161కి చేరింది. కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు లాక్ డౌన్ ను పూర్తిస్థాయిలో అమలు చేయడంతో పాటుగా పలు చర్యలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా పై పోరాటం చేసేందుకు ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నానికి తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు సహకారం అందిస్తూ రెండు రాష్ట్రాల సీఎంల రిలీఫ్ ఫండ్ కు విరాళాలు అందిస్తున్నారు. అలాగే కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన సినీ కార్మికులను ఆదుకోవడం కోసం మెగాస్టార్ చిరంజీవి ఏర్పాటు చేసిన కరోనా క్రైసిస్ చారిటీ(సీసీసీ)కి కూడా పలువురు హీరోలు, సాంకేతిక నిపుణులు, నిర్మాణ సంస్థలు పెద్దమొత్తంలో విరాళాలు అందిస్తున్నారు.
ఈ నేపథ్యంలో కరోనా వైరస్ నివారణ చర్యల కోసం ప్రముఖ హీరో నందమూరి బాలకృష్ణ రూ.1 కోటి 25 లక్షలు విరాళం ప్రకటించారు. ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రాల సీఎం సహాయనిధికి రూ.50 లక్షలు చొప్పున మరియు కరోనా క్రైసిస్ ఛారిటీకి రూ.25 లక్షలు విరాళం అందించారు. ఈ మేరకు రూ. 25 లక్షల రూపాయల చెక్ను కరోనా క్రైసిస్ ఛారిటీ (సీసీసీ) ఎగ్జిక్యూటివ్ మెంబర్ సీ.కళ్యాణ్కు శుక్రవారం నాడు అందించారు. ఈ సందర్భంగా ప్రజలంతా ఇళ్లలోనే ఉండి, లాక్ డౌన్ ను పాటిస్తూ కరోనా విపత్తును ధైర్యంగా ఎదుర్కోవాలని బాలకృష్ణ పిలుపునిచ్చారు.
[subscribe]