ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్కు అరుదైన గౌరవం దక్కింది. జనవరి 20, సోమవారం నాడు ఢిల్లీలోని విజ్ఞానభవన్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన్ను ‘ఛాంపియన్స్ ఆఫ్ ఛేంజ్ 2019’ అనే అవార్డుతో సత్కరించారు. మాజీ రాష్ట్రపతి, భారతరత్న పురస్కార గ్రహీత ప్రణబ్ ముఖర్జీ ఈ అవార్డును అల్లు అరవింద్కు అందించారు. సామాజిక అభివృద్ధి, మరియు సంఘ సేవ చేస్తున్న వ్యక్తులను ప్రోత్సహించే దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది పలు రంగాలకు చెందిన ప్రముఖులకు చాంపియన్స్ ఆఫ్ చేంజ్ పురస్కారాన్ని అందిస్తున్నారు. ఈ క్రమంలో భారతీయ చలనచిత్ర పరిశ్రమకి చేసిన సేవలు, చిరంజీవి బ్లడ్ బ్యాంక్తో పాటు ఇతర సామాజిక సేవా కార్యక్రమాలకు గాను నిర్మాత అల్లు అరవింద్ ఈ అవార్డుకు ఎంపిక అయ్యారు. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ భాషల్లో ఎన్నో విజయవంతమైన చిత్రాలను అల్లు అరవింద్ సినీ పరిశ్రమకు అందించారు. అవార్డు అందుకున్న అల్లు అరవింద్ కు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ, ‘చాంపియన్స్ ఆఫ్ చేంజ్’ అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వానికి, అవార్డుకు ఎంపిక చేసిన జ్యూరీకి ధన్యవాదాలు తెలిపారు. 40ఏళ్ల ప్రయాణంలో జ్ఞాపకాలకు గుర్తుచేసేలా ఈ అవార్డులు ఉపయోగపడతాయని అన్నారు. సినిమాలు చూస్తున్న ప్రేక్షకులకు, చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో రక్తదానం చేస్తున్న రక్త దాతలకు ఈ అవార్డును అంకితం ఇస్తున్నానని పేర్కొన్నారు. అలాగే భవిష్యత్తులో సమాజఅభివృధ్ధి కోసం తన సేవలను మరింత ఉత్సాహంతో కొనసాగిస్తానని తెలిపారు.