ఈ ఏడాది అమర్నాథ్ యాత్ర జూన్ 30న ప్రారంభమై 43 రోజుల పాటు కొనసాగుతుందని జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం వెల్లడించింది. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా అధ్యక్షతన జరిగిన శ్రీ అమర్నాథ్జీ పుణ్యక్షేత్రం బోర్డు సమావేశంలో ఈమేరకు నిర్ణయించారు. జమ్మూ మరియు కాశ్మీర్ ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా ప్రకటించాక ముందు 2019 లో అమర్నాథ్ యాత్ర మధ్యలో రద్దు చేయబడింది. ఆ తర్వాత, కోవిడ్-19 మహమ్మారి కారణంగా గత రెండేళ్లలో పూర్తి యాత్రకు అనుమతి ఇవ్వలేదు. ఈ 43 రోజుల పవిత్ర తీర్థయాత్ర జూన్ 30న ప్రారంభమై రక్షా బంధన్ రోజున ముగుస్తుంది. అయితే ఈ యాత్రలో కోవిడ్ ప్రోటోకాల్ ఆంక్షలను పాటించాలని సూచించారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఏప్రిల్ 11 నుండి ప్రారంభమవుతుందని గవర్నర్ కార్యాలయం తెలిపింది.
దక్షిణ కాశ్మీర్లోని శ్రీ అమర్నాథ్జీ పుణ్యక్షేత్రానికి ప్రతి సంవత్సరం వేసవి నెలలలో శివుని దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు ఎన్నో వ్యయప్రయాసలకోర్చి అనేక ప్రమాదకరమైన పర్వతాల గుండా ప్రయాణం చేస్తారు. శ్రీ అమర్నాథ్జీ పుణ్యక్షేత్రం బోర్డు 2000 సంవత్సరంలో జమ్మూ-కాశ్మీర్ గవర్నర్తో ఎక్స్-అఫీషియో చైర్మన్గా ఏర్పడింది. జమ్మూలోని రాజ్భవన్లో నిన్న జరిగిన ఈ కీలక సమావేశానికి శ్రీ అమర్నాథ్జీ పుణ్యక్షేత్రం బోర్డు 41వ సమావేశానికి అధ్యక్షత వహించిన అనంతరం సిన్హా ఈ ప్రకటన చేశారు. ఈ సంవత్సరం పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున తీర్థయాత్ర కోసం విస్తృతమైన ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులను కోరారు. ఇక పుణ్యక్షేత్రం బోర్డు యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్ నితీశ్వర్ కుమార్, తీర్థయాత్ర యొక్క రూట్ మ్యాప్ మరియు మార్గంలో అందుబాటులో ఉన్న వివిధ సేవల గురించి వివరాలు అందించారని జమ్మూ-కశ్మీర్ పరిపాలన ప్రతినిధి ఒకరు తెలిపారు.
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ