జీఎస్టీ పరిహారం/బకాయిల కింద రాష్ట్రాలకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ మరోసారి నిధులు విడుదల చేసింది. తాజాగా 21 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు మొత్తం రూ.86,912 కోట్లను విడుదల చేయడం ద్వారా మే 31, 2022 వరకు రాష్ట్రాలకు చెల్లించాల్సిన జీఎస్టీ పరిహారం మొత్తాన్ని విడుదల చేసినట్టు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. రాష్ట్రాలు తమ ఆర్ధిక వనరుల నిర్వహణ పాటుగా ఈ ఆర్థిక సంవత్సరంలో మూలధన వ్యయం నిర్వహణ, ఇతర కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించడంలో సహాయపడటానికి ఈ నిర్ణయం తీసుకోబడిందని తెలిపారు. ఈ జీఎస్టీ బకాయిల కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ.3,199 కోట్లు విడుదల కాగా, తెలంగాణ రాష్ట్రానికి రూ.296 కోట్లు విడుదల అయ్యాయి. అత్యధికంగా మహారాష్ట్రకు రూ.14145 కోట్లు, ఆతర్వాత తమిళనాడుకు రూ.9602 కోట్లు, ఉత్తర్ ప్రదేశ్ కు రూ.8874 కోట్లు, కర్ణాటకకు రూ.8633 కోట్లు, ఢిల్లీకి రూ.8012 కోట్లు విడుదల అయ్యాయి.
జూలై 1, 2017న గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్(జీఎస్టీ)ని దేశంలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే జీఎస్టీ (రాష్ట్రాలకు నష్టపరిహారం) చట్టం, 2017లోని నిబంధనల ప్రకారం జీఎస్టీ అమలు కారణంగా ఉత్పన్నమయ్యే ఆదాయ నష్టపరిహారం కోసం ఐదు సంవత్సరాల పాటు రాష్ట్రాలకు హామీ ఇవ్వబడింది. దీంతో రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం అందించడం కోసం, నిర్దిష్ట వస్తువులపై సెస్ విధించబడుతుండగా, సేకరించిన సెస్ మొత్తాన్ని పరిహార నిధికి జమ చేస్తున్నారు. ఈ క్రమంలోనే జులై 1 నుంచి రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారాన్ని పరిహార నిధి నుండి చెల్లిస్తున్నారు. ప్రస్తుతం జీఎస్టీ పరిహార నిధిలో దాదాపు రూ.25,000 కోట్లు మాత్రమే ఉన్నప్పటికి, రూ.86,912 కోట్లను విడుదల చేస్తూ నిర్ణయం తీసుకున్నామని, సెస్ వసూలు పెండింగ్లో ఉన్న తన సొంత వనరుల నుండి మిగిలిన మొత్తాన్ని విడుదల చేస్తునట్టు ఆర్ధిక శాఖ తెలిపింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF