దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. మార్చ్ 26 , గురువారం ఉదయానికి 26 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలో మొత్తం 674 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా తేలినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. అలాగే కరోనా వైరస్ కారణంగా ఇప్పటివరకు 13మంది మృతి చెందినట్లు ప్రకటించారు. మొత్తం కరోనా బాధితుల్లో 43మంది కోలుకున్నారని, మిగతా 593 మందికి ప్రస్తుతం ఐసొలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్నారని చెప్పారు. దేశంలో మహారాష్ట్ర, కేరళలో రాష్ట్రాలలో కరోనా వైరస్ ప్రభావం మరింత తీవ్రంగా ఉంది. మహారాష్ట్రలో 124 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా, కేరళలో 118కి చేరాయి.
మరోవైపు అంతర్జాతీయంగా అన్ని దేశాల్లో కరోనా బాధితుల సంఖ్య 4,50,000 కు చేరగా, కరోనా మృతుల సంఖ్య బుధవారం నాటికే ఇరవై వేలకు పైగా చేరుకుంది. ఇప్పటిదాకా ఇటలీ అత్యధికంగా 7,503 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక స్పెయిన్ లో 3,400, చైనాలో 3287, ఇరాన్ లో 2000, అమెరికాలో 1000 మంది ఈ వైరస్ వలన మరణించారు. కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల మందికి పైగా ప్రజలు లాక్డౌన్లో ఉన్నట్లు ప్రకటించారు.