ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2021 ఏప్రిల్ 9న ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. అయితే ఇండియాలోనే జరగనున్న ఈ సీజన్ ప్రారంభానికి మరో ఆరురోజులే ఉండగా, ప్రస్తుత కరోనా పరిస్థితులు ఇబ్బంది కల్గించే విధంగా మారుతున్నాయి. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలర్ అక్షర్ పటేల్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అక్షర్ పటేల్ కు కరోనా పాజిటివ్ గా తేలిందని, అతను ఐసొలేషన్ లో ఉండి అన్ని ప్రోటోకాల్స్ పాటిస్తునట్టు ఢిల్లీ క్యాపిటల్స్ క్యాంప్ వెల్లడించింది. ఏప్రిల్ 10 న ముంబయిలోని వాంఖడే స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ తో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడాల్సి ఉంది. ఈ క్రమంలో కీలక బౌలర్ అక్షర్ పటేల్ కరోనా బారిన పడడంతో ఢిల్లీ క్యాపిటల్స్ కు ఎదురుదెబ్బ తగిలినట్లయింది.
మరోవైపు ముంబయిలోని వాంఖడే స్టేడియంలో 8 మంది సిబ్బందికి కూడా కరోనా పాజిటివ్గా నిర్థారణ అయింది. వారందరిని ఐసోలేషన్ కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీంతో ఈ స్టేడియంలో మ్యాచులు ఆడాల్సిన చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల యాజమాన్యాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ సీజన్ ఐపీఎల్ మ్యాచులను కేవలం చెన్నై, ముంబయి, అహ్మదాబాద్, ఢిల్లీ, కోల్కతా, బెంగళూరు వంటి 6 వేదికలలోనే నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. ప్రస్తుతం ముంబయి వాంఖడేలో కరోనా కేసులు వెలుగులోకి రావడంతో అక్కడ మ్యాచుల నిర్వహణ, ఆటగాళ్ల భద్రతా విషయంలో మరిన్ని జాగ్రత్తలు, కట్టుదిట్టమైన చర్యలు తీసుకునేలా బీసీసీఐ ఏర్పాట్లు చేస్తునట్టు తెలుస్తుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ