కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన ‘భారత్ జోడో యాత్ర’ ప్రస్తుతం ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో రాజస్థాన్ రాష్ట్రంలో కొనసాగుతోంది. రాహుల్ భారత్ జోడో యాత్ర వరుసగా పలు రాష్ట్రాల మీదుగా సాగుతుండగా ఆయా సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ కీలక నేతలతో పాటుగా పలువురు సినీ ప్రముఖులు, సీనియర్ నేతల వారసులు, మాజీ ప్రభుత్వ అధికారులు, సామాజిక కార్యకర్తలు, అలాగే పలు కీలక రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో రాజస్థాన్ లో జరుగుతున్న రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ పాల్గొన్నారు. బుధవారం ఉదయం రాహుల్ పాదయాత్ర బండౌతి నుంచి ప్రారంభమై సవాయ్ మాధోపూర్ వరకు జరగగా, ఈ సందర్భంగా రాహుల్ తో పాటుగా రఘురామ్ రాజన్ కూడా కలిసి నడుస్తూ పలు అంశాలపై చర్చించారు. వారిద్దరి ఫొటోను కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ లో షేర్ చేస్తూ, “రాహుల్ గాంధీతో ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్… విద్వేషానికి వ్యతిరేకంగా దేశాన్ని ఏకం చేసేందుకు పెరుగుతున్న వ్యక్తుల సంఖ్య మనం విజయం సాధిస్తామని తెలియజేస్తోంది” అని పేర్కొన్నారు.
గతంలో నోట్ల రద్దు/డీమానిటైజేషన్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ గళమెత్తిన సమయంలో రఘురామ్ రాజన్ మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రఘురామ్ రాజన్ తాజాగా రాహుల్ యాత్రలో పాల్గొనడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు దేశంలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ప్రారంభమై డిసెంబర్ 16వ తేదికి 100 రోజులు కానుంది. భారత్ జోడో యాత్ర 100వ రోజు మైలురాయిని అందుకోబోతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ పలు కార్యక్రమాలు తలపెడుతుంది. అలాగే 16వ తేదీన రాహుల్ గాంధీ మీడియాతో కూడా సమావేశం కానున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE