2012లో నిర్భయ సామూహిక అత్యాచారం, హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితులైన ముఖేష్ సింగ్(32), పవన్ గుప్తా(25), వినయ్ శర్మ(26), అక్షయ్ కుమార్ సింగ్ (31) అనే నలుగురిని మార్చ్ 20, శుక్రవారం ఉదయం 5 గంటల 30 నిమిషాలకు ఉరి తీసినట్లుగా తీహార్ జైలు అధికారులు ప్రకటించారు. ఉరిశిక్ష తప్పించుకునేందుకు నలుగురు నిందితులు చివరి వరకు ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ అవీ ఫలించలేదు. కట్టుదిట్టమైన పోలీసు భద్రత మధ్య ఢిల్లీలోని తీహార్ జైల్లో ఉరి శిక్షను అమలు చేశారు. జైలు నెంబర్ 3లో నలుగురు దోషులను ఒకేసారి ఉరి తీశారు. శుక్రవారం ఉదయం ఉరి తీసే ముందు చివరి కోరిక ఏమైనా ఉన్నాయా అని ఆ నలుగురు నిందితులను అడగగా, వారు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని జైలు అధికారులు వెల్లడించారు. ఉరిశిక్ష అమలు జరిగాక నలుగురు దోషులు మరణించినట్లుగా డాక్టర్లు ధ్రువీకరించారు. అనంతరం వారి మృతదేహాలను దీన్ దయాల్ ఉపాధ్యాయ్ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత నిందితుల మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు.
ఎట్టకేలకు నిర్భయ దోషులను ఉరి తీయడం పట్ల నిర్భయ తల్లి సంతోషాన్ని వ్యక్తం చేశారు. తన కుమార్తెకు న్యాయం జరిగిందని, శిక్ష ఆలస్యమైనప్పటికీ న్యాయమే గెలిచిందని ఆమె పేర్కొన్నారు. దోషులకు ఉరిశిక్ష అమలు కావడంతో నిర్భయ ఆత్మ శాంతిస్తుందని చెప్పారు. ఇందుకు సహకరించినందుకు ప్రభుత్వ యంత్రాంగానికి, న్యాయ వ్యవస్థకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి కేసుల్లో న్యాయం కోసం తాను పోరాటం చేస్తానని చెప్పారు. నిర్భయ తండ్రి బద్రినాథ్ సింగ్ మాట్లాడుతూ నిర్భయ కేసు తీర్పు మహిళల విజయం అని పేర్కొన్నారు. దాదాపు ఏడేళ్ళ తర్వాత నిర్భయ కేసులో నిందితులను ఉరితీయడంతో జైలు బయట ప్రజలు పెద్ద ఎత్తున గుమిగూడారు. సామాజిక కార్యకర్తలు, మహిళలు, విద్యార్థులు జైలు వద్దకు చేరుకుని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.