తెలంగాణవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆదిభట్ల యువతి కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడు, ‘మిస్టర్ టీ’ వ్యవస్థాపకుడు నవీన్ రెడ్డిని పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. ఇన్ని రోజులు పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్న నవీన్ రెడ్డి గోవాలో తలదాచుకున్నాడనే సమాచారం మేరకు ఆదిభట్ల పోలీసులు గోవా చేరుకున్నారు. గోవాలోని కండోలిమ్ బీచ్ సమీపంలో నవీన్ రెడ్డిని గుర్తించిన పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో నవీన్ రెడ్డి నుంచి 5 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నవీన్ రెడ్డిని హైదరాబాద్కు తరలించిన అనంతరం పోలీసులు అతడిని మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు. ఇక ఈ కేసులో ఇప్పటికే 32 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే క్రమంలో ఈ రోజు ఉదయం నవీన్ రెడ్డి ముఖ్య అనుచరులు.. చందు, సిద్ధులను అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారించగా నవీన్ రెడ్డి గోవాలో ఉన్నట్లు తెలియజేశారు.
దీంతో ఎలర్ట్ అయిన పోలీసులు ఇప్పటికే బెంగళూరు, ముంబై, చెన్నైలలో అతని జాడ కోసం వెతుకుతున్న బృందాలకు సమాచారం అందించారు. ఈ క్రమంలో సుమారు మూడు గంటల పాటు సెర్చింగ్ చేపట్టిన పోలీసులు చివరిగా నవీన్ కండోలిమ్ బీచ్లోని ఒక చిన్న గుడిసెలో దాక్కున్నట్లు గుర్తించారు. దీంతో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా గుడిసెను చుట్టుముట్టి అతడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే అంతకుముందు యువతిని కిడ్నాప్ చేసి నాగార్జున సాగర్ వైపు వెళ్లిన నవీన్ రెడ్డి పోలీసులు వెంబడిస్తున్నారని తెలుసుకుని కారు దిగి పరారయ్యాడు. అక్కడినుంచి రకరకాల మార్గాల ద్వారా శంషాబాద్, శ్రీశైలం, కర్నూలు, రాయచూర్ మీదుగా ఉబ్లి, పనాజీ నుంచి గోవా చేరుకున్నాడు. కాగా గత నాలుగు రోజులుగా నవీన్ రెడ్డి కోసం దాదాపు పది ప్రత్యేక బృందాలుగా ఏర్పడి పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఇక తనతో యువతి పెళ్లికి నిరాకరించడంతో కక్ష కట్టిన నవీన్ రెడ్డి సరిగ్గా ఆమె నిశ్చితార్థం రోజున సుమారు 100 మంది అనుచరులతో వారి ఇంటిపై దాడి చేసి కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ