ఢిల్లీలో నిజాముద్దీన్ ప్రాంతంలో మార్చ్ రెండవ వారంలో జరిగిన తబ్లిగి జమాత్ కార్యక్రమానికి హాజరైన వివిధ రాష్ట్రాల ప్రజలకు కరోనా వైరస్ సోకడంతో దేశవ్యాప్తంగా ఒక్కసారిగా కలకలం రేగింది. ఈ సమావేశానికి హాజరైన వారిలో తమిళనాడులో 50 మందికి, ఢిల్లీలో 24, తెలంగాణలో 21, ఆంధ్రప్రదేశ్లో 18, అండమాన్ నికోబార్ లో 10, అస్సాం, కాశ్మీర్లలో ఒక్కొక్కరికి కరోనా పాజిటివ్ గా తేలినట్టుగా తెలుస్తుంది. ఈ కార్యక్రమానికి వివిధ దేశాల నుంచి పెద్ద సంఖ్యలో విదేశీయులు హాజరైనట్టుగా పోలీసులు గుర్తించారు.
ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమ నిర్వాహకులైన మౌలానా సాద్, తదితరులపై అంటువ్యాధుల చట్టం 1897 ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు ఢిల్లీ పోలీస్ కమిషనర్ ఎస్.ఎన్. శ్రీవాత్సవ చెప్పారు. అలాగే మర్కాజ్కు హాజరైన కొంతమంది విదేశీయులు సమాచారాన్ని దాచినందుకు జామా మసీదు వజీరాబాద్ ఇమామ్పై కూడా కేసు నమోదు చేసినట్టు సమాచారం. ముందుగా సమాచారం వెలుగులోకి వచ్చాక ఈ కార్యక్రమ నిర్వాహకులపై కేసులు నమోదు చేయాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ లెఫ్టినెంట్ గవర్నర్కు లేఖ రాశారు. ఇప్పటికే కరోనా లక్షణాలతో బాధపడుతున్న వారికీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తుండగా, మరో 1300 మంది సభ్యులను క్వారంటైన్ కి తరలించినట్టు పేర్కొన్నారు.