గుజరాత్ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ప్రధాన పార్టీల మధ్య విమర్శలు కూడా ఎక్కువవుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. మంగళవారం ఎన్నికల సందర్భంగా అహ్మదాబాద్లోని బెహ్రంపురాలో జరిగిన బహిరంగ ర్యాలీలో మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ.. ప్రధాని మోదీని ‘రావణ’ అని సంభోదించారు. కార్పొరేషన్ ఎన్నికలు, ఎమ్మెల్యే ఎన్నికలు లేదా ఎంపీ ఎన్నికలు.. ఏవైనా కావొచ్చు బీజేపీ మాత్రం మోదీజీ పేరు మీద ఓట్లు అడగడం తాము చూస్తూనే ఉన్నామని తెలిపారు. స్థానిక అభ్యర్థి పేరు మీద ఓటు అడగాలని, రేపు అక్కడ ఏదైనా సమస్య వస్తే మోదీ వచ్చి పని చేయబోతున్నారా? మీకు అవసరమైన సమయంలో అతను మీకు సహాయం చేస్తాడా? ఆయనకేమైనా రావణుడిలా 100 తలలు ఉన్నాయా? అని మల్లికార్జున్ ఖర్గే ప్రశ్నించారు.
ఇక కాంగ్రెస్ చీఫ్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. ఆ పార్టీ ప్రధానిని అవమానించిందని ఆరోపించింది. ప్రధాని పేరు దేశంలోనే కాదని, ప్రపంచ వ్యాప్తంగా మారుమోగుతోందని, ఇది ముందు కాంగ్రెస్ పార్టీ గుర్తించాలని చెప్పింది. బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ దీనిపై స్పందిస్తూ.. గుజరాత్ ఎన్నికల వేడిని తట్టుకోలేక మల్లికార్జున్ ఖర్గే మాటలపై నియంత్రణ కోల్పోయారని, ప్రధాని నరేంద్ర మోదీని ‘రావణ్’ అని పిలిచారని అన్నారు. కాంగ్రెస్ గుజరాత్తో పాటు దాని ప్రియతమ పుత్రుడి (ప్రధాని మోదీ)ని అవమానించడమే పనిగా పెట్టుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE